
* 345 రాజకీయ పార్టీలను డీ లిస్ట్ చేయనున్న ఎలక్షన్ కమిషన్
* తెలుగు రాష్ట్రాల్లోనూ..
ఆకేరు న్యూస్, డెస్క్ : కేంద్ర ఎన్నికల సంఘం (ELECTION COMMISION OF INDIA) సంచలన నిర్ణయం తీసుకుంది. పేరుకు రాజకీయ పార్టీగా ఉండి, ప్రజాక్షేత్రంలో పోటీకి దూరంగా ఉంటున్న పార్టీలను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 345 రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం డీ లిస్ట్ (D-LIST) చేసే ప్రక్రియను ప్రారంభించింది. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న పార్టీలను గుర్తించి చర్యలు తీసుకోనుంది. 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని పార్టీలను గుర్తించాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లను ఆదేశించింది. సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లను సాధించాలి. అలా 6 శాతం ఓట్లు రాబట్టని పార్టీలు.. అసలు ఎన్నికల్లో(ELICTIONS)నే పోటీ చేయని పార్టీలపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఈసీ సమాయత్తం అయింది. ఎన్నికల సంఘంలో నమోదైనా గుర్తింపు లేని రాజకీయ పార్టీ (ఆర్యూపీపీ)లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇలాంటి పార్టీలు 345 ఉన్నట్లు ఈసీ గుర్తించింది. ఆ రాజకీయ పార్టీలను డీ లిస్ట్ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలూ ఉండే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో గతంలో చాలా పార్టీలు పోటీ చేశాయి. ఇప్పుడు కొన్ని కనిపించడం లేదు. ఇప్పటికే ఈసీ వద్ద దేశ వ్యాప్తంగా 2,800 పైగా గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీల లిస్టు ఉంది. వాటిలో తొలి విడతలో 345 పార్టీలను తొలగించనుంది.
………………………………………