
-సంవత్సరన్నర కాలంలో రైతులు సంక్షేమానికి 70 వేల కోట్ల వ్యయం
-9 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ
-రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు
-రైతుల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కు ప్రణాళికలు
-సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, జనగామ: రైతన్నలు మీరంతా సిరులు కనిపించే పంటల సాగుపై దృష్టి సారించాలని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కోరారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి 1031 రైతు వేదికలో నూతనంగా వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, సీ.ఎస్ కె. రామ కృష్ణా రావు లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆశీర్వాదం లేకపోతే ప్రజా ప్రతినిధిగా రాణించలేమని, గ్రామ వార్డుసభ్యుల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరికి రైతుల చల్లని చూపులు అవసరమని అన్నారు. గత పాలకులు 4 విడతల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే రైతులకు మిత్తి మాత్రమే మేలు జరిగిందని అన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మనకు అప్పగించారని , మనం అధికారంలో వచ్చే సమయానికి రైతుల ధాన్యం కొనలేని పరిస్థితి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని దుస్థితిలో రాష్ట్రం ఉండేదని, గత పాలకులు వరి వేస్తే ఉరి అనే స్థితి తీసుకొని వచ్చారని ఆవేధన చెందారు. నేడు ప్రజా ప్రభుత్వంలో చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, సన్న రకం ధాన్యానికి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని అన్నారు. పేదలకు సన్న బియ్యం రేషన్ ద్వారా పంపిణి చేస్తున్నామని వివరించారు. వరి పండించడంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలను తెలంగాణ దాటిందని స్పష్టం చేశారు. గత పాలకుల హయాంలో పెండింగ్ పెట్టిన బకాయిలను మెల్ల మెల్లగా చెల్లిస్తున్నామని అన్నారు. ఒక్కొక్క వ్యవస్థను ప్రభుత్వం బాగు చేస్తుందని అన్నారు. 9 రోజులలో రైతులకు 9 వేల కోట్ల ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, 70 లక్షల 11 వేల రైతులకు డబ్బులు బదిలీ చేస్తామని అన్నారు. రైతుల చేతిలో డబ్బులు ఉంటే పెట్టుబడి కోసం అప్పు చేయాల్సిన దుస్థితి రాదని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఉచిత విద్యుత్తు, రైతు బీమా, పరిహారం, బోనస్ కలిపి మొత్తం 18 నెలలో లక్షా 1 వేయి 728 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. గత పాలకులు చేసిన రుణమాఫీ మనం చేసిన రుణమాఫీ పై గ్రామాలలో చర్చ పెట్టాలని అన్నారు. గతంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని , మనం 8 వేల పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 48 గంటల్లో రైతులకు ఖాతాలో పంట డబ్బులు జమ అయ్యేలా చూశామని అన్నారు. దోపిడిదారులకు ధరణి చుట్టం ఐతే, భూ భారతి ద్వారా భూ సమస్యల పరిష్కారం చేస్తున్నామని అన్నారు. ప్రజల చావుల మీద అధికారం రావాలని ప్రతిపక్షాలు కుటిల ఆలోచనలు చేస్తున్నాయని అన్నారు. గతంలో ఎప్పుడైనా సీఎం ఫాంహౌస్ దాటి వచ్చారా అని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించామని, గతంలో దళితుల నుంచి ఒక మంత్రి ఉంటే తమ ప్రభుత్వ హయాంలో స్పీకర్ తో కలిసి 5 దళిత సామాజిక వర్గ సభ్యులు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరంలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు అందించామని, గతంలో నోటిఫికేషన్ల కోసం ఉద్యమాలు చేసిన యువత, నేడు ఆలస్యంగా ఇవ్వమని కోరుతూ ధర్నా చేస్తుందని అన్నారు. సివిల్ సర్వీసెస్ చదువుకునే పిల్లలకు 2 లక్షల రూపాయల సహాయం అందించామని అన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు సబ్సిడీతో అందించేందుకు చర్యలు తీసుకోవాలని, లాభసాటి వ్యవసాయం సాధన దిశగా కృషి చేయాలని అన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలని అన్నారు. రైతులకు సాంకేతికత బదిలీ చేయాల్సిన అవసరం ఉందని, ఏ.ఐ ద్వారా ఎక్కడ సమస్య ఉందో తెలిస్తే అక్కడే ఎరువులు చల్లితే మనకు తప్పుతుందని, భూసారం పెరుగుతుందని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయల చెల్లించిందని, మనం సోలార్ కు మారితే ఈ డబ్బులు ఆదా చేసుకోవచ్చని, మహిళలకు నెలకు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు అదనంగా ఆదాయం కూడా లభిస్తుందని, రైతుల భూములలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అంబానీ ఆదానీలతో వారు పోటీపడే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. సోలార్ పంప్ సెట్ వల్ల ప్రయోజనం, లాభసాటి పంటల సాగుపై సీనియర్ రైతులతో రైతు వేదిక
లలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు జరపాలని అన్నారు. పంట మార్పిడి వ్యవస్థ తప్పనిసరిగా రావాలని, జోన్న రొట్టె తింటే మన ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. వ్యవసాయ ఫీలింగ్ యాక్ట్ తీసుకుని వచ్చి పేదలకు గతంలో ఇందిరమ్మ భూములు పంచి పెట్టిందని, ఆదివాసి గిరిజనులకు పోడు పట్టాలు అందించిందని అన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు పక్షపాతిగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గత పాలకులు సృష్టించిన ఆర్థిక విద్వంసాన్ని సరిచేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం 21 వేల కోట్ల రుణ మాఫీ, 13 వేల 88 కోట్ల రైతు భరోసా, క్వింటాళ్ల సన్న బియ్యం 500 బోనస్ క్రింద 1199 కోట్ల, రైతు బీమా క్రింద 2182 కోట్ల రూపాయల, 200 కోట్ల పంట నష్ట పరిహారం, 16, 691 కోట్లతో ఉచిత విద్యుత్ సరఫరా, 11 వేల కోట్లతో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం మొత్తం 70 వేల కోట్ల ఖర్చు చేశామని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన కోటి 49 లక్షల 39 వేల 112 ఎకరాలకు పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులను జమ చేసే కార్యక్రమం రైతుల సమక్షంలో నేడు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. 9 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అన్నారు. రైతు కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సర కాలంలో రైతు సంక్షేమానికి 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు. గతంలో మన్మోహన్ సింగ్, వైయస్సార్ హయాం లో దేశం మొత్తం మీద 70 వేల కోట్ల రుణమాఫీ చేస్తే, 10 నెలల కాలంలో 21 వేల కోట్ల రుణమాఫీ మన ప్రభుత్వం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రైతు బంధు బకాయిలు 7625 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేశామని అన్నారు. దేశంలో అత్యధికంగా వరి పంట సాగు చేస్తుంది తెలంగాణ రైతు అని అన్నారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్ర పాలన కావాలని నేడు కోరుకుంటుందని అన్నారు. ఉచిత విద్యుత్తు, నీటి పారుదల ప్రాజెక్టు, రుణమాఫీ వంటి అనేక రైతు సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్నంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. కృష్ణ, గోదావరి నదులలో రైతులకు అన్యాయం జరిగిందంటే కారణం గత పాలకులదని మంత్రి విమర్శించారు. సీఎస్ కె. రామ కృష్ణా రావు మాట్లాడుతూ దేశంలో ప్రగతి శీల రైతులు ఉన్న రాష్ట్రం తెలంగాణ, మన రైతులు సంపన్నులు కావాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా రైతుల ఆదాయం పెంచెందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ దాదాపు 6 లక్షల మంది రైతులు నేటి కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు.
………………………………………………………………