ఆకేరు న్యూస్, వరంగల్: ఇద్దరు వ్యక్తుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది.పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆమెను రాజేందర్ అనే దూరపు బంధువు గత నాలుగేళ్లుగా పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. విధుల్లో ఉన్న సమయంలోనూ వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి చేయడం, ఇతరులతో మాట్లాడుతున్నావని అనుమానించడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. రాజేందర్ ప్రవర్తన నచ్చకపోవడంతో అనిత తల్లిదండ్రులు ఆ సంబంధాన్ని నిరాకరించారు.మరోవైపు, తన క్లాస్మేట్ అయిన జబ్బార్ ను అనిత ప్రేమించింది. అయితే, జబ్బార్ కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టాడు.ఈ ఇద్దరి వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత, ఈ నెల 27న రాజేందర్కు ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, అతను ఓదార్చాల్సింది పోయి “చావు.. నీ ఇష్టం” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అనిత గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులు రాజేందర్, జబ్బార్ లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………………
