
* అరకు పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం
* పవన్ కుమారుడికి గాయాలపై స్పందించిన ప్రముఖులు
ఆకేరు న్యూస్, అమరావతి : సింగర్పూర్ రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. సింగపూర్ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 9.45 గంటలకు ప్రమాదం జరిగింది. ఆ భవనంలోని స్కూల్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan) చిన్నకుమారుడు మార్క్ శంకర్ చదువుతున్నాడు. అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు గాయపడ్డాడు. సింగపూర్లోని ఆస్పత్రిలో మార్క్ శంకర్ (Mark Sanker) కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు. ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం పవన్ అరకు పర్యటనలో ఉన్నారు. హుటాహుటిన అక్కడకు వెళ్లాలని నేతలు సూచించినా, షెడ్యూల్ ప్రకారం పర్యటన ముగిశాకే వెళ్తానని పవన్ చెప్పినట్లు తెలిసింది. ఈ పర్యటన అనంతరం పవర్ సింగపూర్ వెళ్లున్నారు. పవన్ భార్య అన్నా లిజినెవో ప్రస్తుతం సింగపూర్లోనే ఉన్నారు.
స్పందించిన ప్రముఖులు
పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు అగ్రిప్రమాదంలో గాయాలు కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) స్పందించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మంత్రి లోకేశ్, తెలంగాణ ఎంపీ బండి సంజయ్, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తదితరులు కూడా పవన్ కుమారుడికి జరిగిన ప్రమాదంపై స్పందించారు. శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
రచ్చబండలో పవన్
అల్లూరి జిల్లా కురిడి గ్రామంలో పవన్ రచ్చబండ నిర్వహించారు. పంచాయితీ అభివృద్ధికి తన సొంత నిధులు రూ.5 లక్షలు కేటాయించారు. ప్రతీ ఇంట్లో తులసి మొక్కను పెంచాలని, గంజాయిని కాదని హితవు పలికారు. అరకును కేరళ స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. వాలంటీర్ల సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కురిడి గ్రామాన్ని దత్తత తీసుకోవాలని స్థానికులు కోరారు. దత్తత గ్రామం కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటన అనంతరం పవన్ సింగపూర్ (Singapur) బయలుదేరనున్నారు.
……………………………………………