* కార్పొరేట్ వర్గాలకే అనుకూలం కేంద్ర బడ్జెట్
* సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు
ఆకేరు న్యూస్, హనుమకొండ : కేంద్ర బడ్జెట్ లో పేద మధ్యతరగతి వర్గాలకు ఒరిగింది ఏమీ లేదు. సబ్ కే సాత్,సబ్ కా వికాస్ మాటలకే పరిమితమయింది. కార్పొరేట్ కే సాత్, కార్పొరేట్ కా వికాస్, అన్న చందంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు . ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్య, వైద్యం వ్యవసాయ రంగాలకు అరకొర నిధులు కేటాయించి నిర్లక్ష్యం చేశారని, ధరల నియంత్రణ, బడ్జెట్ లో ప్రస్తావన లేదన్నారు .ఆదాయపు పన్ను తగ్గింపు పై ఆశగా ఎదురుచూసిన మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశ ఎదురయింది. ఉపాధి అవకాశాలు కల్పించడానికి,బలహీన వర్గాలకు ఉపశమనం కలిగించేలా బడ్జెట్లో నిర్మాణాత్మక సంస్కరణలు లేవని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపారని పేర్కొన్నారు. హై స్పీడ్ రైళ్లు తప్ప తెలంగాణకు ఒరిగింది శూన్యం అని, తెలంగాణలోని ప్రాజెక్టులు, పరిశ్రమలకు ప్రత్యేక నిధులు,కేటాయింపుల ప్రస్తావన లేదని తెలిపారు. ములుగు గిరిజన విశ్వవిద్యాలయానికి అరకొర నిధుల కేటాయించారని,తెలంగాణ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనకబడ్డ జిల్లాలకు రావలసిన ప్రత్యేక నిధులు కేటాయింపులు చేయకుండా బిజెపి ప్రభుత్వం మొండి చేయి చూపిందని శ్రీనివాస రావు తీవ్రంగా విమర్శించారు.
…………………………………………………
