* తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harishrao)కు ఊరట లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీశ్రావు, రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారని సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులుదీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హరీశ్రావు అదే ఏడాది డిసెంబర్ 4న హైకోర్టు(Highcourt)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తూ గత ఏడాది మార్చి 20వ తేదీన ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ చక్రధర్ గౌడ్ మరోసారి సుప్రీంకోర్టు(Supreme court) కు వెళ్లారు. జస్టిస్ బేలా ఎం.త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టివేసింది. కాగా, చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ జూన్ 18న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆ పిటిషన్లను కొట్టివేసింది. ఆ పిటిషన్లను కొట్టేయడంతో హరీశ్రావుకు స్వల్ప ఊరట లభించినట్లయింది.

