* పరీక్షా కేంద్రాల వద్ద కలెక్టర్ కీలక ఆదేశాలు
* స్వయంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్….
మహబూబాబాద్: జిల్లావ్యాప్తంగా ఈనెల 25 నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మరిపెడ మరియు బయ్యారం మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించడమే కాకుండా, కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాల నిఘాను పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 18 పరీక్షా కేంద్రాల ద్వారా 8,287 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. శనివారం జరిగిన పరీక్షకు సంబంధించి హాజరైన వారు 3,822 మంది , గైర్హాజరైన వారు 65 మంది. పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ మరియు సిట్టింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేశామని, పోలీస్ బందోబస్తుతో పకడ్బందీగా ముందుకు సాగుతున్నామని ఆమె తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సిహెచ్. మదర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
