
* హైదరాబాద్లో ధరలు తగ్గాయా.?
* రియాల్టీపై హై.. డ్రా ఎఫెక్ట్!
* మందగించిన క్రయవిక్రయాలు
* తగ్గుతున్న రిజిస్ట్రేషన్లు
* వేచిచూసే ధోరణిలో కొనుగోలుదారులు
* చెరువు పరిసర ప్రాంతాల వెంచర్లపై నీలినీడలు
* సక్రమమైన వాటిపైనా అనుమానాలు
* మారుతున్న రియల్ స్వరూపం
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆది నుంచీ ఆ సంస్థకు అండగా నిలుస్తున్న రేవంత్ రెడ్డి.. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలోనూ ఫుల్ పవర్స్ ఇచ్చారు. అంతేకాదు.. హైడ్రా ఆపరేషన్స్ కోసం 150 మంది అధికారులు సహా 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయించారు. దీంతో మరిన్ని సంచలన కూల్చివేతలకు హైడ్రా సిద్ధం అవుతోంది. మరోవైపు.. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా, తలొగ్గకుండా చెరువులు, నాలాల పరిరక్షణే లక్ష్యంగా ముందుకెళ్తున్న హైడ్రాకు ప్రజల్లో మద్దతూ పెరుగుతోంది. అయితే, నాలాలు, చెరువుల పరిసర ప్రాంతాల్లో 20, 30 ఏళ్ల క్రితమే ఇళ్లు, స్థలాలు కొనుక్కని నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇస్తుండడంతో వారికి కంటిమీద కునుకు కరువవుతోంది. అలాంటి వారికి మినహా.. మెజార్టీ నగరవాసుల మద్దతు లభిస్తోంది. అయితే.. హైడ్రా దూకుడు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రస్తుతం ప్రభావం చూపుతుందనేది కాదనలేని సత్యం.
* హైడ్రా పనితీరుపై విశ్వసనీయత
తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా హైడ్రాను తెరపైకి తెచ్చింది. ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా 2024 జూలై 19న జీవో నంబర్ 99 ద్వారా ఆ సంస్థను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ ఆఫీసర్ ను ఆ సంస్థకు కమిషనర్ గా నియమించింది. చెరువులు, నల్లాల పరివాహక ప్రాంతాల్లో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన ఇళ్ల కూల్చివేతలే లక్ష్యమని ప్రకటించింది. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ భవనం కూల్చివేత, దుండిగల్ పరిధిలో మూడు పెద్ద భవంతులు, విల్లాల కూల్చివేతతో సంచలనం రేకెత్తించింది. అయితే, ఇదంతా ఆరంభశూరత్వమని చాలామంది భావించారు. మరికొందరేమో.. విపక్ష నేతల టార్గెట్గా ఈ కూల్చివేతలు సాగుతున్నాయని ఆరోపించారు. అయితే హైడ్రా 18 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది. 43.94 ఎకరాల్లోని నిర్మాణాలను నేలకూల్చింది. అయితే ఆ లిస్టులో కాంగ్రెస్ కీలక నేత, కేంద్రమాజీ మంత్రి పల్లం రాజు కూడా ఉండడంతో హైడ్రా పనితీరుపై విశ్వసనీయత ఏర్పడిరది.
* తగ్గుతున్న రిజిస్ట్రేషన్లు
అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, స్థలాలు కొనాలనుకునేవారు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఎన్నడూలేని రీతిలో రిజిస్ట్రేషన్లు మందగిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న కూల్చివేతల ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖపై స్పష్టంగా కనిపిస్తోంది. జూలై నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ %-% మల్కాజిగిరి, సంగారెడ్డిలో 58,000 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఆగస్టులో 41,200 మాత్రమే జరిగాయి. జూలైలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1105 కోట్ల ఆదాయం రాగా, ఆగస్టులో రూ.320 కోట్ల మేర ఆదాయం తగ్గి రూ.785 కోట్లకి పడిపోయింది.
* ఇది తాత్కాలికమేనట
హైడ్రా కూల్చివేతల్లో విక్రయానికి నిర్మించిన భవనాలు, వెంచర్లలో వేసిన నిర్మాణాలు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అప్పటికే ఆ భవనాల్లోని ఫ్లాట్ల కోసం అడ్వాన్స్ లు చెల్లించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈనేపథ్యంలో కొత్తగా ఇళ్లు, ఫ్లాట్లు కొనేవారు ఆలోచనలో పడుతున్నారు. మరికొందరు ఇదే అదునుగా, హైడ్రా తమ వద్దకు వచ్చేలోగా అమ్మేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈక్రమంలో కొన్నింటిని తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈక్రమంలో హైదరాబాద్లో ఫ్లాట్ల ధరలు తగ్గాయటగా అనే ప్రచారం మొదలైంది. ఆ ప్రచారం సంగతి ఎలాగున్నా.. రియల్ కొనుగోళ్లలో స్తబ్దత ఏర్పడడం మాత్రం వాస్తవం. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. అయితే ఇది తాత్కాలికమేనని హైడ్రా అధికారులు అంటున్నారు.
* ఇక లేక్ వ్యూలు ఉండవా?
మరోవైపు హైడ్రా కూల్చివేతల ప్రభావంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగ స్వరూపం కూడా మారుతోంది. ప్రముఖ వెంచర్ల బ్రోచర్లు కూడా మారుతున్నాయి. లేక్ వ్యూ అని ప్రచారం చేసుకోవడానికి సందేహిస్తున్నారు. చెరువులు, నాలాల పక్కన నిర్మాణాలు అనగానే, కొనుగోలుదారులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో బిల్డర్లు కూడా స్వరూపం మారుస్తున్నారు. లేక్ వ్యూ స్థానంలో.. రిచెస్ట్.., కంఫర్ట్, స్పేసియస్ అని కొత్త పంథా ప్రచారంతో కొనుగోదారులను ఆకట్టుకునే ప్రయత్నిస్తున్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లోని వెంచర్లపై నీలినీడలు అలుముకోవడం, అన్నీ సక్రమమే అయినా కొనుగోలుదారులు భయాందోళనలో ఉండడంతో వెంచర్ల నిర్వాహకులు విభిన్నదారుల్లో ముందుకు సాగుతున్నారు. ఫలితంగా హైదరాబాద్లో రియల్ రంగం స్వరూపం కూడా మారుతోంది.
………………………….