Jangaon Collector Sandeep Kumar jha KGBV Visit
ఆకేరు న్యూస్. స్టేషన్ ఘన్ పూర్:
చదివితే ఏదైనా సాధ్యమేనని కఠిన శ్రమ విజయానికి మార్గమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండల కేంద్రంలోని కేజీబీవీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సందర్భంగా విద్యార్థులకు ఫాస్ట్ మాథ్స్ బుక్స్ అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి కేజీబీవీలో డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేయాలని, దినచర్యలో విద్య, క్రీడలు రెండూ ఉండాలి అన్నారు.
అకాడమీ తరగతుల ప్రారంభం తర్వాత ప్రతి 15 రోజులకు మాక్ టెస్ట్ నిర్వహించాలన్నారు. చదువుతోనే సమాజంలో మార్పులు వస్తాయన్నారు.విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
పాఠశాలలోని ఆర్ఓ ప్లాంట్ పనితీరును పరిశీలించిన కలెక్టర్ విద్యార్థినులకు శుద్ధమైన తాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. టాయిలెట్లు, కంప్యూటర్ గది, తరగతి గదులు, ఇతర గదులను పరిశీలించి, వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థినులకు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సాహం అందించేందుకు ప్రతి కేజీబీవీలో బాస్కెట్ బాల్ కోర్టు, షటిల్ కోర్టు వంటి క్రీడా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అంతకుముందు తిమ్మంపేటలో నిర్మాణ దశలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించి గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
* ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జఫర్గడ్ మండల కేంద్రంలో బిఎల్వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఫారాలు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా, పూర్తిగా పూరించిన దరఖాస్తులను తిరిగి సేకరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, బిఎల్ఓలు, తదితరులు పాల్గొన్నారు.
