
– మీడియా రంగంలో పెట్టుబడిదారుల ప్రవేశం ప్రమాదకరం
– జర్నలిస్టులకు వేజ్ బోర్డు అమలు చేయాలి
– టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్, : హక్కుల సాధన కోసం జర్నలిస్టులు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య (MAMIDI SOMAYYA) పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలతో పాటు రెండు వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్టాల రద్దుకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా బుధవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్),హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే) సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జర్నలిస్టుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం హెచ్ యుజే అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని అన్నారు. ఎన్నో ఏండ్లుగా వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం అమల్లో ఉందనీ, దానిని రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మీడియా సంస్థల్లో జర్నలిస్టులకు వేజ్ బోర్డు అమలు చేయాలని కోరారు. జర్నలిస్టుల (JOURNALISTS) పట్ల వివక్ష చూపటం మంచిది కాదని మామిడి సోమయ్య అన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ, మీడియా రంగంలో కార్పొరేట్ సంస్థలు ప్రవేశించి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, జర్నలిస్టుల హక్కులు హరించి వేస్తున్నారని అన్నారు. జర్నలిస్టులకు కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదని, యాజమాన్యాలు వెట్టిచాకిరికి గురిచేస్తున్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై అధ్యయనం, హక్కుల సాధన దిశగా జర్నలిస్టులు ముందుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు. హెచ్ యుజే (HUJ) అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టు చట్టం రద్దు ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షులు పి. ఆనందం, బి రాజశేఖర్, కార్యదర్శులు ఇ.చంద్ర శేఖర్, సలీమా, గండ్ర నవీన్, హెచ్ యుజే కార్యదర్శి జగదీశ్వర్, నాయకులు నాగవాణి, మధుకర్, విజయ, మాధవ రెడ్డి, కాలేబ్, వీరేశ్,వెంకట స్వామీ, సీనియర్ జర్నలిస్టులు రత్నాకర్ సురేష్,భాస్కర్, శశికళ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………