Pangidipalle Pre Primary School
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లె లో నూతనంగా మంజూరైన ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలను బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు ఏండ్ల లోపు పిల్లలకు నాణ్యమైన నర్సరీ, LKG, UKG విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 2900 ప్రీ-ప్రైమరీ స్కూళ్లను మంజూరు చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం వల్లే ఆయనకు ప్రభుత్వ విద్య ప్రాధాన్యత బాగా తెలుసని, అందుకే విద్యా వ్యవస్థ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణను విద్యా రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, రైతులు ప్రతి ఒక్కరూ సహకరించి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి కె. శ్రీధర్, గ్రామ సర్పంచ్ కళ్యాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలపురి కనకరత్నం, యుగంధర్, పోడేటి బిక్షపతి, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
