
* లేకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుంది
* రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
ఆకేరున్యూస్, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని.. లేకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ వ్యతిరేక చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడ అభినందన గ్రాండ్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీరామ్ జ్ఞానేశ్వర్కు ఆయన నియామక పత్రం అందజేసి మాట్లాడారు. కుల గణన పూర్తయినప్పటికీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. సర్పంచ్, ఎంపీటీస్, జడ్పీటీసీ లలో బీసీలకు 20 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిని 42 శాతం పెంచితేనే బీసీలు రాజకీయంగా అభివృద్ధి సాధిస్తారన్నారు. విద్య, ఉద్యోగ రంగాలలో కూడా బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, బీసీలలోని అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క దానికి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
………………………………………….