
* సైబర్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
* కాంబోడియా కేంద్రంగా ఇండియాలో సైబర్ నేరాలు
* సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు చేసిన పోలీసులు
* ఐదుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
ఆకేరు న్యూస్ డెస్క్: ఫేస్ బుక్ అకౌంట్లో ఇన్వెస్ట్ మెంట్ టిప్స్ అంటూ అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్లకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నరసింహప్ప ను సైబర్ నేరగాళ్లు అతని వద్ద నుంచి 1కోటి 73లక్షల 99 వేల 333లను కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరసింహప్ప..,తన ఫేస్ బుక్ అకౌంటులో ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అంటూ తారాసపడిన పోస్టు కు ఆకర్షితుడై తద్వారా తెలీకుండానే సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసి కాంబోడియ దేశం నుండీ ఆపరేట్ చేస్తున్న వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయ్యాడు. సైబర్ నేరగాళ్లకు సంబంధించిన ఫేక్ యాప్ లైన VIP66 Bajaj Iinvestment మరియు K26 Zerodaha Market in sights లలో సైబర్ నేరగాళ్ల సూచనల మేరకు తొలుత రూ. 12 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. రోజుల వ్యవధిలోనే రూ. 5.50 లక్షలు లాభం వచ్చేటట్టు చూపించి ఆ డబ్బు మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే విధంగా అవకాశం కల్పించి నమ్మించారు. అనతి కాలంలోనే లక్షల్లో లాభం రావడంతో మరింత నమ్మకం పెరిగింది. దీంతోనే… ఈ ఏడాది ఏప్రిల్ 15 నుండీ మే14 వరకు నెల రోజుల వ్యవధిలోనే విడతల వారీగా రూ. 1,73,99,333/- లు ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్ మొత్తం మరియు వచ్చిన లాభం కలిపి సుమారు రూ. 3.40 కోట్లను విత్ డ్రా చేయాలనీ ప్రయత్నించగా ట్యాక్స్ మరియు బ్రోకరైజ్ కింద 40 శాతం డబ్బులు కడితేనే విత్ డ్రాకు అవకాశమిస్తామని సమాధానం రావడంతో అనుమానం కల్గి నరసింహప్ప అనంతపురం సైబర్ విభాగం పోలీసులను ఆశ్రయించాడు. వేపరాళ్ల నరసింహప్ప 18-06-25 న ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు Cr.No.112/2025, U/s 318(4) BNS and Sec 66 (D) of IT Act నమోదు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో సి.ఐ లు జయనాయక్, వెంకటరమణ, షేక్ జాకీర్ , ఎస్సైలు నాగమధు, గూర్నాథరెడ్డిల ఆధ్వర్యంలో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
ప్రత్యేక పోలీసు బృందాల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. సదరు ఫేక్ యాప్ లను కాంబోడియా దేశం నుండీ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. వీటిపైన దర్యాప్తు కొనసాగుతోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నరసింహప్ప వేసిన రూ.1,73,99,333/- లు విడతల వారీగా 13 అకౌంట్లలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ మొత్తం 13 ఫేక్ అకౌంట్లు కూడా దేశంలోని పలు ప్రాంతాలలో క్రియేట్ చేసినవే… డిల్లీ, పూణే, సూరత్ , గుణ (మధ్యప్రదేశ్ ), పాట్నా, సమస్తీపూర్, బీడ్, నుపాడ, బెంగుళూరు, గుంటూరు, విజయవాడలలో ఫేక్ అకౌంట్లు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
తీగ లాగితే డొంక కదిలింది
ఫేక్ అకౌంట్ల దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసు బృందాలకు తీగలాగితే డొంక కదలిన చందంగా ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. విజయవాడ ఫేక్ అకౌంట్ ను లోతుగా విచారించారు. ఆ ప్రాంతంలో ఓ ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ మరియు వడ్లముడి ఫణికుమార్ ల ద్వారా తెరిచిన అకౌంట్లకు సంబంధించిన బ్యాంకు పాసు బుక్కులు, తదితరాలను కొంగతి కృష్ణ ద్వారా సాపిరెడ్డి కోదండరామ దుర్గసాయి ప్రసాద్ సేకరించి డిల్లీలోని శ్యాంజీ, ధర్మేంద్ర సింగ్ లకు చేర్చారు. వీరు …డిల్లీ కేంద్రంగా ఫేక్ అకౌంట్లలోని డబ్బులను ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ తో వివిధ అకౌంట్ల ద్వారా డబ్బును మార్పిడి చేశారు. సదరు డబ్బును తదుపరి క్రిప్టో కరెన్సీ ద్వారా దేశం దాటించేందుకు సిద్ధమైనట్లు ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు తెలిపారు. ఈ క్రైంలో భాగస్వాములైన ఢిల్లీకి చెందిన భావనేష్ గోయల్ , ఉత్తర ప్రదేశ్ బులంద్ షహర్ కు చెందిన ధర్మేంద్ర సింగ్ హైదరాబాద్ జీడామెట్లకు చెందిన సాపిరెడ్డి కోదండరామ దుర్గసాయి ప్రసాద్, NTR జిల్లా చందర్లపాడు మండల కేంద్రానికి కొంగతి కృష్ణ,వడ్లమూడి ఫణికుమార్ లను అరెస్టు చేసినట్లు ఎస్పీ జగదీష్ వివరించారువారి వద్ద నుంచి రూ. 41.20 లక్షల నగదు, 08 సెల్ ఫోన్ లు, కారు, 20 ఏటిఎం కార్డ్స్, 15 సిమ్ కార్డ్స్, 05 బ్యాంక్ పాస్ బుక్కులు, 10 చెక్కు బుక్కులు, 02 wifi రూటర్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఇంత పెద్ద మొత్తంలో కాంబోడియా కేంద్రంగా జరిగిన ఈ ఫ్రాడ్ ను చేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు చేసిన సి.ఐ లు జయనాయక్, వెంకటరమణ, షేక్ జాకీర్ , ఎస్సైలు నాగమధు, గుర్నాథరెడ్డీల ఆధ్వర్యంలో పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపధ్యంలో ప్రజలు ఎలాంటి యాప్స్ ను నమొద్దని విజ్ఞప్తి చేశారు. RBI, SEBI వంటి చట్టబద్ధ సంస్థల నుండి గుర్తింపు పొందని ఏవైనా ఫైనాన్స్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా డబ్బు పెట్టవద్దని హెచ్చరించారు.డబ్బు పంపే ముందు కంపెనీ యొక్క వెబ్సైట్, రివ్యూలు, రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవాలని సూచించారు, వాడకంలో లేని తమ బ్యాంకు ఖాతాలను వెంటనే రద్దు చేసుకోవాలి లేదంటే అవి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి సైబర్ నేరాల కోసం వాడుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
………………………………………………..