
* కుంభమేళా తొక్కిసలాటలో 14 మంది మృతి..
* కొనసాగుతున్న సహాయక చర్యలు
* తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రయాగ్ రాజ్ (Prayagraj) మహా కుంభమేళా తొక్కిసలాటలో 14 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. కుంభమేళాలో జరిగే మౌని అమావాస్య రెండో పుణ్యస్నానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్ రాజ్ వద్దకు అత్యధిక సంఖ్యలో తరలిరావడంతో బుధవారం తెల్లవారు జామున త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మందికిపైగా మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. మరో 50 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్లోని స్వరూపరాణి ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. అక్కడ పోస్టు మార్టం నిర్వహించనున్నారు. త్రివేణి సంగమంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి ఉదయం సుమారు 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు తరలింపు ప్రక్రియ జరిగింది. .
ప్రధాని, రాహుల్ సంతాపం..
మహా కుంభమేళాలో జరిగిన దుర్ఘటనపై ప్రధాని మోడీ(Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు యూపీ సీఎంతో మాట్లాడుతూ పరిస్థితిపై సమీక్షిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అన్నారు. కాగా, కుంభమేళా ప్రారంభం నుంచి నిన్న ఉదయం వరకు 19.94 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ప్రాణాల కోల్పోయిన వారికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో జరిగిన విషాద తొక్కిసలాట పట్ల ఏపీ సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ.. మహాకుంభమేళా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యం కోల్పోకుండా వారికి ఓదార్పు కల్పించాలని కోరుకుంటున్నాను అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్టు చేశారు. ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడినవారికి సరైన వైద్యం అందించాలని రేవంత్ కోరారు.
……………………………………………