
* పోచారం మునిసిపాలిటీ ఏకశిలానగర్లో ఉద్రిక్తత
* పేదల భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపణలు
* కూల్చడం తప్ప.. పేదల కన్నీళ్లను పట్టించుకోవట్లేదని సర్కారుపై ఆగ్రహం
* ఏకశిళానగర్లో ఇళ్ల నిర్మాణానికి అడ్డుపడుతున్న ప్రభుత్వం : ఈటల
ఆకేరు న్యూస్, మేడ్చల్ : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(ETALA RAJENDAR) ఓ స్థిరాస్తి దళారిపై చేయి చేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం మునిసిపాలిటీ ఏకశిలానగర్(EKASILA NAGAR) లో ఈరోజు ఈటల రాజేందర్ పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకశిలానగర్వాసులు కూడా దళారిపై దాడికి పాల్పడ్డారు. దాడి నేపథ్యంలో ఈటల మాట్లాడుతూ.. పేదలు కొనుక్కున్న జాగాలకు బీజేపీ(BJP) అండగా ఉంటుందన్నారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. భూములు కొనుక్కున్న పేదల సమస్యపై కలెక్టర్తోను, సీపీతోను మాట్లాడినట్లు వెల్లడించారు. దొంగపత్రాలతో కొందరు పేదల భూములను లాక్కుంటున్నారని అన్నారు.
బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కై పేదల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. అరుంధతీనగర్, బాలాజీనగర్, జవహర్నగర్ లోనూ ఇదే సమస్య ఉందని అని వెల్లడించారు. 40, 50 గజాలలో ఉన్న పేదల షెడ్లను కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు తప్ప పేదల కన్నీళ్లను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. గూండాలు దౌర్జన్యం చేస్తున్నారని పేదలు చెబుతున్నారని అన్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేదని పేదలు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. ఏకశిలానగర్లో 1985లో చిరుద్యోగులు ప్లాట్లు కొనుకున్నట్లు తెలిపారు. నిన్న, మొన్నటి వరకు వారికి నిర్మాణ అనుమతులు వచ్చాయని, కొత్త ప్రభుత్వం వచ్చాక రావడం లేదన్నారు. ఏకశిలానగర్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే(GOVERNMENT) అడ్డుపడుతోందని ఆరోపించారు.
……………………………………