
– డ్రగ్స్ రహిత సమాజానికి పాటుపడుదాం
– జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా
– జనగామ లో భారీ ర్యాలీ
ఆకేరు న్యూస్, జనగామ: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, డ్రగ్స్ వద్దు జీవితాలే ముద్దు అని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, విద్య, వైద్య, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జనగామ చౌరస్తా లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏర్పాటు చేసిన ర్యాలీని డిసిపి రాజమహేంద్ర నాయక్ ఏ.ఎస్.పి. పండరి నితిన్ చేతన్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళలు, ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొనగా బస్టాండ్ చౌరస్తా లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నెహ్రూ చౌక్ మీదుగా కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ముఖ్యఅతిథిగా పాల్గొని డ్రగ్స్ ఫ్రీ సమాజం కోసం జాగృతి పోస్టర్ ని ఆవిష్కరించారు. విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ పై మత్తు పదార్థాల పట్ల విరక్తిని కలిగించేలా వీడియోలను ప్రదర్శించారు. డ్రగ్స్ వ్యతిరేక సంతకాల ప్రచారం, డ్రగ్స్ కు నో జీవితానికి ఎస్ అనే నినాదాలు చేశారు. కలెక్టర్ రిజ్వాన్ భాషా మాట్లాడుతూ యువత డ్రగ్ రహిత సమాజం కొరకు ఉద్యమంలా పోరాడాలన్నారు. ప్రతి విద్యార్థి, యువకుడు యుద్ధ సైనికుడుగా డ్రగ్స్ నియంత్రణకు సమరం సాగించాలని పిలుపునిచ్చారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారి వివరాలను తెల్ల కాగితంపై రాసి పోస్ట్ బాక్స్ లో వేయాలన్నారు. ఆచూకీ తెలిపితే బహుమతులు ఇస్తామన్నారు. డ్రగ్స్ కు యువత అలవాటు పడితే కుటుంబం, సమాజం బ్రష్టు పట్టిపోతుందని హెచ్చరించారు. డ్రగ్స్ ఎక్కువగా బస్టాండ్, రైల్వే స్టేషన్స్ వంటి ప్రాంతాల్లో అమ్మకాలు, సేవించం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంతాల్లో యువత పై నిఘా పెంచితే డ్రగ్స్ ను అరికట్టవచ్చని అన్నారు. ఈ రోజు ట్రాఫికింగ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అనారు. పిల్లలు, మహిళల అక్రమ రవాణా ను అరికట్టేందుకు నిరంతరం అప్రమత్తతో ఉండాలన్నారు. డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణలో పోలీసు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్ పై అవగాహన పొందాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యార్థుల అవగాహన కొరకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజయ్య, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ అధికారిని ఫ్లోరెన్స్, జిల్లా వైద్య శాఖ అధికారి మల్లికార్జునరావు, పోలీస్ శాఖ అధికారులు, సైకాలజిస్టులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………….