*స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు!!
ఆకేరు న్యూస్, పాలకుర్తి: పాఠశాల విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా, స్థానిక కార్మెల్ స్కూల్లో ప్రైవేట్ పాఠశాల బస్ డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి సి.ఐ (CI)హాజరై, డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ, డ్రైవర్ల చిన్న పొరపాటు అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది క్షమించరాని నేరమని, మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల డ్రైవర్ ప్రాణంతో పాటు పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని స్పష్టం చేశారు. నిర్ణీత వేగ పరిమితిని మించి వాహనాలను నడపవద్దని, అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని సూచించారు.డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ మాట్లాడటం లేదా ఇతర వ్యాపకాల వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని వివరించారు.పాఠశాల వాహనాలను నడిపే వారు సాధారణ డ్రైవర్ల కంటే ఎక్కువ బాధ్యతతో ఉండాలని సి.ఐ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కోరుతూ పలు కీలక సూచనలు చేశారు. బస్సు ఆగిన తర్వాతే పిల్లలను ఎక్కించుకోవాలని, వారు సురక్షితంగా దిగే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
బస్సు కండిషన్, బ్రేక్స్ మరియు ఇతర సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు: సిగ్నల్స్ పాటించడం, సీట్ బెల్ట్ ధరించడం మరియు రోడ్డు నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి అని పేర్కొన్నారు.”విద్యార్థుల భద్రత మీ చేతుల్లో ఉంది, ఆ బాధ్యతను గౌరవించండి” అని డ్రైవర్లకు హితబోధ చేశారు.
