* ఇద్దరు మహిళలు దుర్మరణం
ఆకేరు న్యూస్, మెదక్ : ఆగి ఉన్న టూరిస్టు బస్సును డీసీఎం ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు దిగేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. మెదక్ (Medak) జిల్లా పెద్దశంకరం పేట మండలం కోలపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం నుంచి 40 మంది పర్యాటకులు టూరిస్టు బస్సులో తీర్థయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో షిర్డీ (Shiridi) నుంచి శ్రీశైలం (Srisailam) వెళ్తున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున బస్సు డ్రైవర్ చాయ్ తాగేందుకు కోలపల్లిలో ఓ హోటల్ వద్ద బస్సు నిలిపారు. వెనుకనుంచి వచ్చిన ఓ డీసీఎం.. బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో బస్సు వద్దే నిల్చున్న ఓ మహిళ అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జోగిపేటలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరో మహిళ చనిపోయారు. మిగిలినవారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను నారాయణమ్మ (50), సూరప్పమ్మ (62)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
……………………………….
