
* జిల్లాను అడవి జిల్లాగా తీర్చిదిద్దుదాం
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు:ప్రకృతి సిద్ధమైన అడవులతో మానవ మనుగడకు సాధ్యం అవుతుందని, స్వచ్ఛమైన గాలితోనే ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని నేడు నాటిన మొక్కలే భారీ వృక్షాలుగా తయారవుతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.శుక్రవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో ని ఏకో పార్కులో మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఆర్ పి ఎఫ్ 39 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్, టి జి ఎస్ పి 5 వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రమణ్యం, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 25 వేల మొక్కలు నాటాలని లక్ష్యంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం హర్షించదగిందని అన్నారు. ములుగు జిల్లా పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని పర్యటక ప్రాంతం తో పాటు దట్టమైన అడవులు ఉండటం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఈకో ప్రాంతంలో వాచ్ టవర్,వాక్ ఫాల్స్ ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయమని, అడవులను రక్షిస్తూనే పచ్చదనాన్ని కాపాడుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి ద్వారా వారి ఆయుష్షు పెరుగుతుందని, అడువులను కాపాడే విషయం లో
తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.ములుగు జిల్లాను అడవి జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నతనంలో వన మహోత్సవం గురించి పుస్తకాలలో ప్రత్యేకంగా చదువుకున్నామని కానీ నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వనమోత్సవం కార్యక్రమంలో భాగస్వాములు అవడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ములుగు జిల్లా ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉందని, జిల్లాలో వనదేవతలు కొలువై ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా లో అన్ని వసతులతో కూడిన అద్భుతమైన పార్కు ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు కృషి చేశారన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే సామాజిక విలువలు, అడవుల వల్ల కలిగే లాభాలు, ఉపయోగాలు గురించి తెలుసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఏ పి డి వెంకటనారాయణ, ఎఫ్ ఆర్ ఓ లు, ఎఫ్ డి ఓ లు, రేంజర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………….