
* రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆరోపణలు
* యూజీసీ నిబంధనలపై ఇతర సీఎంలతో కలిసి పోరాడతానని వెల్లడి
* పద్మ అవార్డుల్లో తెలంగాణపై వివక్ష
* రాష్ట్ర సిఫార్సులను పట్టించుకోలేదు : రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వర్సిటీల స్వయం ప్రతిపత్తిని హరించాలని కేంద్రం చూస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana Cm Revanthreddy) ఆరోపించారు. రాష్ట్రాలపై దండయాత్ర చేస్తోందని, అది మంచిది కాదని హితవు పలికారు. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. వర్సిటీలపై రాష్ట్ర హక్కులను కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. కేంద్రం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇతర సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలతో పోరాడతామని స్పష్టం చేశారు. యూజీసీ(UGC) కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుడగ సాగిస్తుందా అని ప్రశ్నించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉందని, కేంద్రం తక్షణమే యూజీసీ కొత్త నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరారు.
కేంద్రం ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే ఎలా అన్నారు. కేంద్రం తీరు ఇలానే ఉంటే రాష్ట్రాలు నామమాత్రం అవుతాయని తెలిపారు. ప్రొఫెసర్ల వయో పరిమితి 65 ఏళ్లకు పెంచే యోచన ఉందన్నారు. పద్మ అవార్డుల ప్రకటనలో తెలంగాణపై వివక్ష చూపించిందని, రాష్ట్రం సిఫారసు చేసిన వారికి అవార్డులు ఇవ్వలేదని విమర్శించారు. గద్దర్(Gaddar), చుక్కా రామయ్య(Chukka Ramayya), అందెశ్రీ(Andesri), గోరటి వెంకన్న(Gorati Venkanna), జయధీర్ తిరుమలరావు పేర్లు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. తమ సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చారని, మనకు నాలుగైనా ఇవ్వలేదన్నారు. పద్మ అవార్డులపై వివక్షపై కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. మంద కృష్ణ(Manda Krishna)కు పద్మశ్రీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
………………………………………