
* భారత జట్టు విజయంలో కీలకపాత్ర
* రెండోసారి ప్రపంచ కప్ ను ముద్దాడిన మహిళల జట్టు
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. మలేషియా వేదికగా జరుగుతోన్న ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా భారత మహిళల జట్టు రెండో సారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. ఇంతటి ఘన విజయంలో తెలంగాణకు చెందిన అమ్మాయి సత్తా చాటడం గమనార్హం. ఓపెనర్ గా దిగిన గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఎవరీ త్రిష..?
త్రిష తెలంగాణలోని భద్రాచలంలో జన్మించారు. ఆమె తండ్రి రామిరెడ్డిఒక ప్రైవేట్ కంపెనీలో ఫిట్నెస్ ట్రైనర్గా పని చేశారు. క్రికెట్ పై త్రిషకు ఉన్న మక్కువ ను గుర్తించి క్రమం తప్పకుండా క్రికెట్ ఆడేలా ప్రోత్సహించారు. కుమార్తె కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టి, క్రికెట్లో శిక్షణ ఇచ్చేందుకు భద్రాచలం నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఏడేళ్ల వయసులో, త్రిష సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేరారు. హైదరాబాద్ సౌత్ జోన్ ఏజ్ గ్రూప్ జట్లకు ఆడిన తర్వాత, త్రిష 2017–18 సీనియర్ మహిళల T20 లీగ్లో హైదరాబాద్ తరపున అరంగేట్రం చేశారు. ఆమె 2021–22 U19 మహిళల క్రికెట్ ఛాలెంజర్స్, అలాగే 2021–22 ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగిన సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో భారతదేశం B తరపున ప్రాతినిధ్యం వహించారు. జనవరి 2023లో, త్రిష 2023 ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో భారతదేశం తరపున ఆడారు. టోర్నమెంట్ ఫైనల్లో, ఆమె 24 పరుగులతో అత్యధిక స్కోరు సాధించింది, ఆమె జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. నాన్న నమ్మకాన్ని నిలబెడుతూ త్రిష ఆటపై పట్టు సాధించింది. ఇక రెండో సారి అండర్-19 ప్రపంచకప్లో తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించింది. టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచి భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె ఆడుతున్న ఆటను చూస్తుంటే అతి త్వరలోనే భారత మహిళల సీనియర్ జట్టులోనే చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గొంగడి త్రిషకు ప్రత్యేక అభినందనలు
అండర్ -19 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భారతదేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ గెలుపు ప్రతిభ, కృషి, దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తుందన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ గొంగడి త్రిష.. ఈ టోర్నీలో 300 కంటే ఎక్కువ పరుగులు చేయడమే కాకుండా 10 వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందన్నారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు. గొంగడి త్రిష భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని హరీశ్రావు పేర్కొన్నారు.
………………………………………….