Telangana Pulse Polio Programme 2026
ఆకేరు న్యూస్, డెస్క్:
రాష్ట్రవ్యాప్తంగా నేడు (జూన్ 28) పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించేందుకు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
* ప్రతి చిన్నారికి తప్పనిసరిగా..
పల్స్ పోలియో కార్యక్రమంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
* బూత్లు, మొబైల్ బృందాలు సిద్ధం
నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పోలియో బూత్లలో పిల్లలకు చుక్కలు వేయనున్నారు. జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ అందించేందుకు మొబైల్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
* నాలుగు జిల్లాల్లో అదనంగా మరో రోజు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉండటంతో జూలై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
* తల్లిదండ్రులకు ఆరోగ్య శాఖ విజ్ఞప్తి
పిల్లలకు గతంలో పలుమార్లు పోలియో చుక్కలు తాగించినప్పటికీ, ఈసారి కూడా తప్పనిసరిగా వేయించాలని ఆరోగ్య శాఖ సూచించింది. పోలియో రహిత తెలంగాణ లక్ష్య సాధనలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని అధికారులు కోరుతున్నారు.
