TGRTC SAMME NARSAMPET DRIVER FIRE ACCIDENT
* ఆర్టీసీ డిపో ఎదుట డ్రైవర్ శంకర్ గౌడ్ ఆందోళన
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ న్యాయపరమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మనస్తాపం చెందిన శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
* డిమాండ్లు పరిష్కరించలేదని…
గత కొంతకాలంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం, పైగా అధికారుల వేధింపులు పెరగడంతో డ్రైవర్ శంకర్ గౌడ్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే నేడు డిపో వద్ద ఒక్కసారిగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
దీన్ని గమనించిన తోటి కార్మికులు, సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన శంకర్ గౌడ్ను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
* కార్మికుల ఆందోళన
ఈ ఘటనతో ఆగ్రహించిన తోటి ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట భారీ ఎత్తున బైఠాయించారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే తమ సహచరుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడని నినాదాలు చేశారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
