
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, నల్లగొండ : నల్లగొండ జిల్లాకు తాగునీరు అందించడంలో భాగంగా శ్రీశైలం సొరంగం పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. శుక్రవారం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపి కుందూరు రఘు వీర్ రెడ్డి,
స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఎస్ ఎల్ బి సి టన్నెల్ పనులను పరిశీలించారు. టన్నెల్ అవుట్ లెట్ ప్రాంతానికి చేరుకున్న మంత్రులు, అధికారులతో కలిసి ప్రత్యేక ట్రైన్లో సొరంగం లోపలికి వెళ్లి పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలోనే ఇరిగేషన్, అటవీ, విద్యుత్, రెవిన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ టన్నెల్ పనులను పూర్తి చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో అంచనా వ్యయం భారీగా పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ప్రాజెక్టులు పూర్తి కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 3500 కోట్లు ఖర్చుపెడితే పూర్తయ్యే ఎస్ ఎల్ బి సి సొరంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణం కింద భూములు కోల్పోయే నిర్వాసితులకు మానవతా దృక్పథంతో పరిహారం అందించాలని మంత్రి సూచించారు. 2027 సెప్టెంబర్ 20 లోగా ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏఎంఆర్పి ద్వారా సాగునీరు అందించడం శాశ్వత పరిష్కారం కాదని తాను ఏనాటి నుంచో చెబుతున్నానన్నారు. అనుకున్న గడువులోగా శ్రీశైలం సొరంగం పనులను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
…………………………….