* ఇంకా కేసీఆర్ ఫొటోనే ఉంది
* హైడ్రా తీరుపై మండిపడిన దానం నాగేందర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాపై పలు సందర్భాల్లో నోరువిప్పారు. హైడ్రా వల్ల పేదల జీవితాలు ఆగం అవుతున్నాయని, పిల్లల పుస్తకాలు, సామగ్రి బయటపడేయడంతో బాధ కలుగుతుందని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరోసారి స్పందించారు. ‘‘నేను పోలీసులతో, హైడ్రా విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మా ఏరియాకు వస్తే ఊరుకునేది లేదని రంగనాథ్కు చెప్పిన. పేదల ఇండ్లను కూలుస్తామంటే ఊరుకోను. అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్ కాను. నా ఇంట్లో వైఎస్, కేసీఆర్ ఫొటోలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫోటో ఇంకా రాలేదు’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సొంత పార్టీలో పెను సంచలనంగా మారాయి. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానం వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చింతల్ బస్తీ కూల్చివేతలకు సంబంధించి దానం వ్యవహారతీరును పరిశీలిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ తెలిపారు. తాజాగా మరోసారి అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెడ్డి ఫోటో విషయంలో ఆయన తీరుపై కాంగ్రెస్ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా.. ఆపరేషన్ రోప్లో భాగంగా ఇటీవలకాలంలో చింతల్బస్తీలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే.. అధికారులపై విరుచుకుపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కూల్చివేతలను నిలిపివేయాలంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
…………………………..