
* బనకచర్లపై తెలంగాణ నాయకులు రాజకీయం చేస్తున్నారు
* ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు
* ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం
ఆకేరున్యూస్ అమరావతి ః బనకచర్లపై తెలంగాణ రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారని
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బనకచర్లపై తెలంగాణ లోని అందరూ నేతలు మాట్లాడుతున్నారని తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కూడా బనకచర్లపై చర్చించారని చంద్రబాబు అన్నారు. ఏపీ నేతలు కూడా తెలంగాణ వాదనలకు సరైన సమాధానం చెప్పాలని చంద్రబాబు సూచించారు. ఏపీ సెక్రటేరియట్ లో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పలు అంశాలను ఆమోదించారు. మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని రెండో విడత భూసేకరణను ఆమోదించింది. రాజధానిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది.
అనుమతి లేకుండా ప్రాజెక్టులు
తెలంగాణ లో అనుమతి లేని ప్రాజెక్ట్లను కూడా కడుతున్నారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. తెలంగాణ వాడుకోగా మిగిలిన నీళ్లను మాత్రమే కదా ఏపీ వాడుకునేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్పై మనం దశల వారిగా ముందుకు వెళ్తామని సూచించారు. ఆ తర్వాత కేంద్రప్రభుత్వం ఏం చెబుతుందో దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకుందామని అన్నారు .సీఆర్డీఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో ప్రభుత్వానికి సంబంధించి… 2019కు ముందు ఆరేళ్ల అనుభవ దారు ఎవరు ఉంటారో వారికే నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. జిల్లా స్థాయిలో ఏడాది పాలనపై జిల్లా ఇన్చార్జి మంత్రి సమావేశం పెట్టాలని కోరారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఏడాది పాలనపై సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ నెలాఖరులోపు ఈ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారం…
రాష్ట్రంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను ఏడాదిలోపు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. అన్న క్యాంటీన్ ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.టెన్నిస్ ప్లేయర్ సాకేత్కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్లో వాణిజ్య పంటలకు డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలు వేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
………………………………………………….