
* తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి ‘అలయ్ బలయ్’ గొప్ప వేదిక
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి ‘అలయ్ బలయ్’ గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాడు రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు, సకల జనులు ఉద్యమంలో కార్యోన్ముఖులు కావడానికి కూడా అలయ్ బలయ్ ఒక కారణమని గుర్తుచేశారు. తెలంగాణలో పెద్ద పండుగ దసరా సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. గత 19 ఏండ్లుగా ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను పునరుద్దరించడానికి వారు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా అంటే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయని… అలాగే అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకొస్తారని కొనియాడారు. దత్తాత్రేయ వారసురాలిగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న బండారు విజయలక్ష్మికి అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం, పార్టీ పెద్దలంతా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మన బాధ్యత అని చాటి చెప్పామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ , తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారితో పాటు ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ , మేఘాలయ గవర్నర్ విజయ్ శంకర్ , రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ కిషన్రావ్ బాగ్డే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.
…………………………………………