
* రోగులను ఆప్యాయంగా పలకరించిన కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
* ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్
ఆకేరు న్యూస్, జనగామ: అవ్వ నీకేమైంది డాక్టర్లు మంచిగా చూస్తున్నారా అంటూ రోగులను అప్యాయంగా పలకరిస్తూ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ పనితీరుకు సంబందించిన డెమో ని కలెక్టర్ పరిశీలించారు. ఫిజియోథెరపీ విభాగం సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ నిల్వకేంద్రం నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అకస్మాత్తుగా రక్తం సరఫరా చేసేందుకు సరిపడా యూనిట్ లను సిద్ధం గా ఉంచుకోవాలన్నారు. వైద్యం కోసం వచ్చిన మహిళలతో కలెక్టర్ మాట్లాడారు. కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన దరావత్ మంజులను ఆసుపత్రి వైద్య సేవల గురించి కలెక్టర్ అడగగా పాము కరిచిందని, వెంటనే ఆసుపత్రికి రాగా సకాలంలో వైద్యం అందినట్లు తెలిపారు. డయాలసిస్ విభాగాన్ని కలెక్టర్ సందర్శించగా రఘునాథపల్లి మండలం నవాబుపేటకు చెందిన బూడిద మేఘన మాట్లాడుతూ వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం భోజన సదుపాయాలపై కలెక్టర్ రోగులను అడిగి తెలుసుకున్నారు. భోజనం సకాలంలో పెడుతున్నట్లు తెలియచేయగా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్లతో మాట్లాడుతూ వైద్యులు అందుబాటులో ఉండాలని అలాగే నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల పర్యవేక్షకులు గోపాలరావు, ఆర్.ఎం.ఓ. లక్ష్మీనారాయణ, డాక్టర్లు అనురాధ శంకర్, పద్మ ప్రభ వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
……………………………………………………….