
* కానీ కేంద్ర పథకాల పేర్లు మార్చితే ఊరుకోం
* కేంద్రం ఇచ్చే పథకాలకు ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టరు
* కేంద్ర మంత్రి బండిసంజయ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: మీ పథకాలకు ఏమైనా పేర్లు పెట్టుకోండి.. కానీ కేంద్ర పథకాలకు పేర్లు మార్చితే ఊరుకోమని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందన్నారు. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా… గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాంగ్రెస్కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని.. గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు.
గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అని స్పష్టం చేశారు. రైతు భరోసా, కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని తెలిపారు. గతంలో పీఎం ఆవాస్ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే… కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా? డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా?’’ అంటూ ప్రశ్నించారు. పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలని హితవు పలికారు. గద్దర్కు ఎట్లా పద్మ అవార్డులిస్తామని ప్రశ్నించారు. ఎంత మంది బీజేపీ కార్యకర్తలను మట్టు పెట్టారో తెలియదా అన్నారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే… నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
……………………………………………….