
*కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
* మహిళ సంఘాల ఆధ్వర్యంలో హోటల్ ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే
అకేరు న్యూస్, జనగామ: మహిళలు స్వయం శక్తితో ఆర్థిక అభివృద్ధిని సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కావాల్సిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. శుక్రవారం పాలకుర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శ్రీ శివ పార్వతి మహిళా సంఘంలోని ఇద్దరు సభ్యులు ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఎమ్మేల్యే యశస్విని రెడ్డితో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కాంటీన్ ద్వారా మహిళలకు ఆర్థిక ప్రగతి ఏర్పడుతోందన్నారు. మహిళామణుల స్వయం ఉపాధికి ప్రభుత్వం అండగా నిలబడుతూ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తోందని.. ఈ రుణాలతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివిధ యూనిట్ లకు ఏర్పాటు కి సహకారం అందిస్తుందన్నారు. కాంటీన్ లో తయారుచేసే భోజనం నాణ్యత తో పాటు రుచికరంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి మాట్లాడుతూ మహిళల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఉత్సాహంగా ఉండే మహిళలకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే కాంటీన్ లో టిఫిన్ చేసి రుచికరంగా ఉందని తరాల అనిత, తరాల అనిత (ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్ళు ) నిర్వాహకురాళ్ల ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ వసంత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, మాజీ సర్పంచ్ యాకాంతరావు, నాయకులు, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీ
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలతో పాటు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను, ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా, ఎమ్మెల్యే మామిడాల యశస్సులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేసే దిశగా ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు సాగుతున్నాయన్నారు.
………………………………………………..