
– ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ దుర్మార్గం
హైదరాబాద్, ఆకేరు న్యూస్ : ప్రజాపాలనలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అక్రమంగా అరెస్టుచేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేయడాన్నిఆయన తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా “ఎమర్జెన్సీ”ని ముఖ్యమంత్రి అమలుచేస్తున్నారన్నారు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే సీఎం రేవంత్ రెడ్డి నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కేందుకు విఫల యత్నం చేస్తున్నారన్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో పూర్తిగా చేతిలెత్తేసి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలా నియంత్రించాలనే దానిపైనే సర్వశక్తులు ఒడ్డుతున్నారన్నారు.
అక్రమంగా అరెస్టుచేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ ను వెంటనే విడుదల చేయాలి. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసే విష సంస్కృతికి చరమగీతం పాడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తకాదు, అరెస్టులు అంత కన్నా కాదని, ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరన్నారు.
…………………………………………..