
ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని మర్రిపల్లిగూడెం గ్రామ శివారులో సోమవారం గుర్తుతెలియని మహిళ అస్థిపంజరం లభ్యమైనట్లు మండల పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. పోలీస్ ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం మర్రిపల్లిగూడెం గ్రామ శివారులోని పొలాల్లో మహిళ అస్తిపంజరం ఉందన్న గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మృతదేహంపై పుర్రె, ఎముకల అవశేషాలు, లేత పసుపురంగు చీర, ఆకుపచ్చ జాకెట్ ఉన్నాయని సీఐ తెలిపారు. ఘటన స్థలాన్ని కాజీపేట ఏసీపీ తిరుమల్ చేరుకొని కేసుకు సంబంధించి పలు సూచనలు ఇచ్చారని తెలిపారు. గ్రామపంచాయతీ సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
…………………………………………