
* హైదరాబాద్ నాంపల్లిలో ఉద్రిక్తత
* బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి.. బీజేపీ ప్రతిచర్య
* గాంధీభవన్ ముట్టడికి తరలిన బీజేపీ నేతలు
* భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
* కాంగ్రెస్ కార్యాలయాన్ని తగులబెడతాం : రాజాసింగ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాంపల్లిలో రాజకీయంగా ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. బీజేపీ(BJP), కాంగ్రెస్(CONGRESS) కార్యకర్తలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. ఢిల్లీ రోడ్లను ప్రియాంకా గాంధీ(PRIYANKA GANDHI) బుగ్గల్లా మారుస్తామని బీజేపీ నేత రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. హైదరాబాద్(HYDERABAD)లోని బీజేపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు సైతం దాడికి పాల్పడ్డారు. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ ప్రతిదాడికి యత్నం
బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా కాషాయనేతలు గాంధీభవన్(GANDHIBHAVAN) ముట్టడికి ప్రయత్నించారు. యువమోర్చా ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. బారీకేడ్లను తొలగించుకుని వెళ్లి ఆందోళన చేపట్టారు. గాంధీభవన్ వద్ద ఉన్న కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను చింపేశారు. ఈక్రమంలో పోలీసులు, యువమోర్చా నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు. పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నేతలు నినాదాలు చేశారు.
వెంటనే అరెస్ట్ చేయాలి.
నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA RAJASINGH) ఖండించారు. దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాము తలుచుకుంటే కాంగ్రెస్ కార్యాలయాన్ని తగులబెడతామని హెచ్చరించారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని అన్నారు. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. నిరసన తెలిపే పద్ధతి ఇదేనా అన్నారు.
…………………………………………….