
* వరంగల్ లో పుట్టి.. ఉద్యమాలే ఊపిరిగా ఎదిగి..
* పద్మశ్రీతో దేశ వ్యాప్త గుర్తింపు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి :
ఓసారి గ్రామంలో కులపరమైన ఘర్షణ తలెత్తింది. ఆ ఘర్షణలో బాధితుల పక్షాన నిలబడి ఓ వ్యక్తి గొంతెత్తాడు. నాటి నుంచీ ఆ గొంతు సామాజిక అంతరాలపై నిగ్గదీస్తూనే ఉంది. తన జాతి అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉంది. ఒక్క ఉద్యమానికే పరిమితం కాకుండా, హృద్రోగ బాధిత చిన్నారులు, దివ్యాంగుల కోసం కూడా ముందడుగు వేశాడు. సామాజిక సేవకు పునరంకితమయ్యాడు. ఆ వ్యక్తే మందకృష్ణ మాదిగ. వరంగల్ జిల్లా హన్మకొండలో జన్మించిన ఆయన ఉద్యమాలే ఊపిరిగా ఎదిగారు. 13 మందితో దండోరా మొదలుపెట్టి.. అంచలంచెలుగా వేలాది మంది యువతను మేల్కొలిపారు. మాదిగ రిజ్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) ని స్థాపించి లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న ఆయనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
దండోరాతో అసమానతలపై దండయాత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశాం జిల్లాకు చెందిన ఒక చిన్న గ్రామం ఈదుమూడి లో 1994 జూలై 7 న 14 మంది యువకులతో మందకృష్ణ మాదిగ తన జాతి ఆత్మగౌరవం కోసం దండోరా.. మొదలుపెట్టారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఉద్యమం మొదలుపెట్టారు. అనతికాలంలోనే గ్రామగ్రామాన చైతన్యం తేవడంలో కృషి చేశారు. ఆ తర్వాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) ఏర్పాటు చేసి, ఏపీలో ఎస్సీ రిజర్వేషన్స్ ను ఒక సామాజిక వర్గం ఎక్కువగా అనుభవిస్తోందని గుర్తించి మిగతా సామాజిక వర్గాలైన మాదిగ, మాదిగ ఉప కులాలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక సామజిక అంశాలలో సమాన వాటా సాధించాలని పోరాటం మొదలుపెట్టారు. అణగారిన కులాల ఆత్మగౌరవం, సమన్యాయం పంపిణి విలువల కేంద్రంగా బయలుదేరిన దండోరా ఉద్యమం అనతికాలం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఉద్యమంగా ఎదిగింది.
గొంతు విప్పితేనే చర్చ జరుగుతుందని..
ఆంధ్ర ప్రదేశ్ దళితులలో జనాభా పరంగా 70 శాతం ఉన్న మాదిగ, మాదిగ ఉపకులాలకు 10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు అందితే, 30 శాతం ఉన్న మాలలకు మిగతా 90 శాతం అందుతున్నాయని చాటి చెబుతూ మంద కృష్ణ ఊరూరా దండోరా మొదలుపెట్టారు. దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాల్ని సొంతం చేసుకోవడం సరికాదని, మార్పు రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉద్యమాలు సాగించారు. మాదిగలను సంఘటితం చేశారు. ఏళ్ల తరబడి ఉద్యమాలను నడిపారు. నడుపుతూనే ఉన్నారు. సంఘటితమై గొంతు విప్పితేనే తమ సమస్యలపై చర్చ జరుగుతుందని మాదిగలను చైతన్యవంతం చేశారు.
మాదిగల ఆత్మగౌరవానికి చిహ్నంగా..
ఆరంభంలో పీపుల్స్వార్ పార్టీ పట్ల ఆకర్షితుడైన మంద కృష్ణ జైలు జీవితం కూడా అనుభవించారు. ఆ తర్వాత సాయుధ విప్లవ పంథాను వదిలి అప్పటికే జనజీవన స్రవంతిలోకి వచ్చిన ప్రముఖ కవి శివసాగర్ వెంట నడిచారు. కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న దళిత మహాసభతో గొంతుకలిపారు. అనంతరం ఎంఆర్పీఎస్ ఏర్పాటు చేసి ఉమ్మడి ఏపీవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించారు. ఈ ఉద్యమం స్ఫూర్తితో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో సైతం ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలు బయలుదేరాయి. మంద కృష్ణ తన పేరు చివర మాదిగ సామాజికవర్గం పేరును కలుపుకొని మందకృష్ణ మాదిగగా ప్రకటించుకున్నారు. మాదిగల ఆత్మగౌరవానికి చిహ్నంగా మారారు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఉద్యమాన్ని విస్తరించి.. రిజర్వేషన్ల ఫలాల సాధనలో ఓ అడుగు ముందుకేశారు. ఉన్నత న్యాయస్థానం సైతం రిజర్వేషన్ల వర్గీకరణకు అనుగుణంగా తీర్పు వెలువరించడం వెనుక మందకృష్ణ మాదిగా అసమాన్య కృషి ఉంది.
మానవీయ ఉద్యమాలు సైతం..
రిజర్వేషన్ల కోసమే కాదు.. మందకృష్ణ మాదిగ మానవీయ ఉద్యమాలను కూడా నడిపించారు. కుల మతాలకు అతీతంగా సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, అసమానతలకు, నిరాదరణకు గురైన దివ్యాంగులు, వృద్దులు, వితంతువులు, చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల కోసం కూడా ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. వై ఎస్ రాజశేకర్ రెడ్డి ప్రభుత్వంలో (2005) ఆంధ్ర ప్రదేశ్ లో గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత వైద్యం చేయాలనే నిర్ణయం కూడా మంద కృష్ణ మాదిగ కృషి వల్లే అన్న ప్రచారం ఉంది. అలాగే వికలాంగుల హక్కుల పొరాట సమితి ఏర్పాటు చేశారు. సామాజిక పరంగా, కుటుంబపరంగా, విద్య పరంగానే కాకా వివిధ రూపాలలో వివక్షత, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యలపై ఉద్యమించారు. ఇలా సామాజిక అంశాలపై సమర శంఖం పూరించిన మందకృష్ణ.. ఇప్పుడు తనకు దక్కిన పద్మశ్రీ గౌరవాన్నిమాదిగ జాతికి అంకితం చేడయం గమనార్హం.
…………………………………..