
* గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్ గా భారత్
* ఇండియా ఏ1 మిషన్ ను ప్రారంభించాం
* మూడో టర్మ్ లో మూడు రెట్ల వేగంతో అభివృద్ధి
* 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం
* జాతీయ భద్రతకు పెనుముప్పుగా డిజిటల్ మోసాలు, సైబర్ క్రైం, డీప్ ఫేక్
* రాజ్యాంగం ముందు నాటి చట్టాలపైనా సమీక్ష
* భావి తరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు
* ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగం
ఆకేరు న్యూస్, డెస్క్ : త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తెలిపారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. భారత సామాజిక చేతనకు మహా కుంభమేళా ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం మూడో టర్మ్ లో మూడు రెట్ల వేగంతో అభివృద్ధి సాగుతోందన్నారు. 3 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. దేశాభివృద్ధి కోసం వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే తమ లక్ష్యమన్నారు.
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దిశగా అడుగులు
గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం 70 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు రాష్ట్రపతి వివరించారు. ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించామన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ (One Nation – One Election) దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. మూడు లక్షల మంది మహిళలను లక్పతి దీదీగా మార్చడమే తమ సంకల్పమన్నారు. ఇప్పటికే లక్షా 15వేల మంది లక్ పతి దీదీగా మారానన్నారు. మనదేశ మహిళలు ఒలింపిక్స్ లో పథకాలు పొందుతున్నారన్నారు. భారత్ ను ఇన్నోవేషన్ పవర్ హౌస్ (Innovation Power House)గా మారుస్తున్నామన్నాని, ట్యాక్స్ విధానాలను సరళీకరించామన్నారు. మన దేశం త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవ్థగా మారబోతున్నట్లు చెప్పారు.
రాష్ట్రపతి నోట.. పోలవరం మాట..
దేశ సమగ్రత విధానల కోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించామన్నారు. అలాగే ఇండియా ఏ1 మిషన్ ను ప్రారంభించామన్నారు. ఈ-గవర్నెన్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. దేశీయ పౌర విమాన రంగం అభివృద్ధి చెందుతున్నట్లు వివరించారు. ఏపీ జీవనాడి అయిన పోలవరం (Polavaram) నిర్మాణానికి 12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశంలో అటల్ టన్నెల్, సోన్ మార్గ్ టన్నెల్ వంటివి నిర్మించినట్లు వివరించారు.
క్రెడిట్ గ్యారెంటీ స్కీం
చిన్న వ్యాపార సంస్థలు దేశ ఆర్థిక అభివృద్ధికి వెన్నుముక లాంటివి.. అందుకే వాటిని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఎంఎస్ ఎంఈల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీం తీసుకొచ్చినట్లు వివరించారు. ఆదివాసీల ప్రాంతాల్లో 30 మెడికల్ కాలేజీలు ప్రారంభించామన్నారు. దళితులకు, పేదలకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందుతున్నట్లు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీలో సమర్ధతను పెంచుతున్నామన్నారు. దేశీయ సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రతకు డిజిటల్ మోసాలు, సైబర్ క్రైం(Cyber Crime), డీప్ ఫేక్ పెనుముప్పుగా మారుతున్నాయని తెలిపారు.
పెరుగుతున్న కేన్సర్ కేసులు
దేశంలో కేన్సర్ (Cancer) కేసులు పెరుగుతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని పలు మందులపై దిగుమతి సుంకాలను తొలగించామన్నారు. వ్యాధి నిర్ధారణ, మెరుగైన వైద్య సేవల కోసం ఆస్పత్రుల సంఖ్యను పెంచామన్నారు. రాజ్యాంగం ముందు నాటి చట్టాలపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కాలానికి తగినట్లుగా వాటిని మారుస్తున్నామన్నారు. రక్షణరంగంలో ఆత్మ నిర్భరతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.
………………………………………………………