
* కలవరపెడుతున్న కాల్పుల ఘటనలు
* రూ. 20వేలకే దొరుకుతున్న తుపాకులు
ఆకేరు న్యూస్, ప్రతినిధి : అతనో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. పేరు బత్తుల ప్రభాకర్. ఏపీలోని చిత్తూరు జిల్లా. 2022లో విచారణ నిమిత్తం అనకాపల్లి కోర్టుకు పోలీసులు తీసుకెళ్తుండగా తప్పించుకున్నాడు. అప్పటి నుంచీ పరారీలోనే ఉన్నాడు. శనివారం (ఫిబ్రవరి 1) సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ దగ్గర ఉన్నాడని తెలుసుకుని వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపాడు. ఓ హెడ్కానిస్టేబుల్కు బుల్లెట్ గాయాలయ్యాయి. అతి కష్టం మీద ప్రభాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో ఆయన నివాసం ఉంటున్న ఫ్లాట్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా 428 తూటాలు దొరికాయి. మూడు పిస్టోళ్లు లభ్యం అయ్యాయి.
కాకినాడకు చెందిన 23 ఏళ్ల సాయిరాంరెడ్డి బీకాం కంప్యూటర్ చదువును మధ్యలో ఆపేశాడు. నేరాలబాట పట్టాడు. హైదరాబాద్లోని ఓ బాయ్స్ హాస్టల్లో ఉండేవాడు. ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన సాయిరాంరెడ్డి వద్ద ఏకంగా ఏడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
రోజుల వ్యవధిలోనే భారీ ఘటనలు
కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని బీదర్లో ఏటీఎంలో డబ్బును నింపేందుకు వచ్చిన ఇద్దరు సెక్యూరిటీగార్డులపై కాల్పులు జరిపిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో కాల్పులకు పాల్పడింది. ఆ ఘటన మరువక ముందే శనివారం మరో కాల్పుల ఘటన జరిగింది. ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్ సైబరాబాద్లోని ఓ పబ్ వద్ద ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపడం రాజధానిలో తీవ్ర కలకలం రేపింది. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ కాల్పులు సంచలనంగా మారాయి.
బిహార్, యూపీల నుంచి దిగుమతి!
తుపాకులు యథేచ్ఛగా కారు చౌకగానే దొరుకుతుండడంతో దొంగల చేతుల్లోకి చేరుతున్నాయి. నేరాలు, ఘోరాలు చేసే క్రమంలో ప్రజలు, పోలీసులు ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేస్తే కాల్పులకు పాల్పడుతున్నారు. అంతర్రాష్ట్ర నేరగరాళ్లు, దోపిడీ దొంగలు, స్మగ్లర్లు ఇష్టానుసారంగా తుపాకులను వాడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బిహార్, యూపీ రాష్ట్రాలకు చెందిన కొంతమంది వలస కార్మికులను మచ్చిక చేసుకుంటున్న కొందరు వారి సహకారంతో తుపాకులను కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది వలసకార్మికులు దాన్నో వ్యాపారంగా చేసుకొని తమ రాష్ట్రాల నుంచి తుపాకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి దిగుమతి చేసి గుట్టుగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజధానిలో కాల్పుల ఘటనలు ఎన్నెనో..
* టప్పాచబుత్రా పోలీస్స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రత్యర్థులు ఓ యువకున్ని కాల్చి చంపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు.
* గతేడాది మైలార్దేవ్పల్లిలో పేకాట స్థావరంపై దాడిచేసిన పోలీసులకు తుపాకీతో సంచరిస్తున్న యువకుడు పట్టుబడ్డాడు. అతన్ని విచారించగా.. బిహార్ నుంచి తుపాకీని కొనుగోలు చేసిన అతను దాన్ని నగరంలో విక్రయించడానికి తెచ్చినట్లు తెలిసింది.
* తుపాకీతో తిరుగుతున్న ఓ వ్యక్తిని ఇటీవల బేగంపేట పోలీసులు పట్టుకున్నారు. విజయవాడకు చెందిన వ్యక్తి ప్రత్యర్థుల నుంచి రక్షించుకోవడానికి నగరంలో తలదాచుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రాణహాని ఉందని గుర్తించిన వ్యక్తి తెలిసిన వారి ద్వారా బిహార్కు వెళ్లి రూ. 22వేలకు తుపాకీని కొని తెచ్చుకున్నాడు.
* ఇటీవల బాలాపూర్ పరిధిలో ఒక రౌడీషీటర్ హత్య జరిగింది. గోల్కొండకు చెందిన సుపారీ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. బిహార్ నుంచి తుపాకీ తెప్పించుకొని ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
………………………………………………….