
* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ దివాకర
* అధికారులతో సమీక్షా సమావేశం
ఆకేరు న్యూస్ ములుగు : జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ సంస్థ, ఇంజనీరింగ్ అధికారులు, 10 మండలాల అధికారులు, ఏ పి ఎం లు, పంచాయతి సెక్రటరీల తో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్ సంపత్ రావు తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయని గ్రామాల వారీగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మొదటి విడతలో చేపట్టిన పనులలో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.గృహాల నిర్మాణ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ యాప్ లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ దశలను బట్టి దశల వారీగా లబ్దిదారులకు వారి ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలకు విడతల వారిగా 5 లక్షల రూపాయలను అందిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాణా నిర్మూలించేందుకు టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాల ను మ్యాపింగ్ చేయాలని సూచించారు. లబ్ధిదారుని గృహ నిర్మాణ అవసరాన్నిబట్టి గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, ఏఈలు ఇసుక టోకెన్ల జారీని చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ, ఇంజనీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, ఏ పి ఎం లు, సి సి లు, పంచాయతీ కార్యదర్శిలు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………