
*నామినేటెడ్ పదవులు కేటాయించాలి
* నిరాదరణకు గురవుతున్న యాదవులు
* జూన్ 30న హైదరాబాద్ లో ఆత్మగౌరవ సభ
* యాదవులంతా తరలిరావాలి
* కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
ఆకేరు న్యూస్ హనుమకొండః దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న యాదవులు రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్నారని అఖిల భారత యాదవ సంఘం సభ్యుడు, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. బుధవారం హన్మకొండ రాంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశం లో అఖిల భారత యాదవ సంఘం సభ్యులు రాజారాం యాదవ్, గోవర్ధన్ యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న యాదవ జాతికి కేబినెట్ లో చోటు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేలు లేరు అనే సాకుతో యాదవ జాతిని వెనకబాటుకు గురిచేయవద్దన్నారు. యాదవులకు ఓ మంత్రి పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ లో యాదవులకు చోటు కల్పించాలని కోరారు. ఈ నెల 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న యాదవ ఆత్మ గౌరవ సభకు రాష్ట్రంలోని యాదవులంతా కదిలి రావాలని సుందర్ రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా..
ఈ సమావేశంలో పాల్గొన్న రాజారాం యాదవ్ మాట్లాడుతూ జూన్ 30న నిర్వహించనున్న సభ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిర్వహిస్తామని తెలిపారు. సభను విజవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా యాదవులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సారి మంత్రి వర్గ విస్తరణ చేపడితే యాదవులకు ఒక్క మంత్రి పదవి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిపిన సమగ్ర కుటంబ సర్వేలో ముస్లింలు లేకుండా బీసీలు 52% ఉన్నారని, కానీ ఇప్పుడు ముస్లింలను కలుపుకొని 56% బీసీలు ఉన్నారు అని చెప్పడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. యాదవులు, మున్నూరుకాపులు లేని మంత్రి మండలి ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు మున్నూరుకాపులు కే కేశవరావు, డీఏస్ లాంటి వారు ఎన్నో సేవాలు చేశారని చెప్పారు. బీసీలకు మంత్రి మండలిలో సమూచిత స్థానం కల్పించాలని బీసీ కులాల లెక్కన 9 మందికి చోటు కల్పించాలని కోరారు. యాదవులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రెండో విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ.. చరిత్రలో యాదవులు లేకుండా మంత్రి మండలి లేదని, యాదవ మంత్రి లేకుండా పాలన చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. యాదవులను మరిచిపోతే తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల సత్తా చాటుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోమేకల కృష్ణ యాదవ్ , గోవర్ధన్ యాదవ్, గీరబోయిన రాజయ్య యాదవ్,మేకల కృష్ణ యాదవ్, మాదం రజనీ కుమార్, సిద్దిరాజు యాదవ్, గండ్రకోట రాకేష్ యాదవ్, పృధ్వి యాదవ్, ప్రమోద్ యాదవ్, సాయి యాదవ్, రాజు యాదవ్, బండి పర్వతాలు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………………….