
- జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఆకేరు న్యూస్, జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా.. నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేయాలని సంకల్పించిందని… ఇందులో భాగంగా జిల్లాలోని జనగామ నియోజకవర్గానికి అలాగే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు మంజూరయ్యాయని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని.. అందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏటీసీ లను ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఐటీఐ లో ఎన్ సీ వీ టీ అనుమతించిన ఇండస్ట్రీ 4.0 ట్రేడ్స్ ఆధారంగా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ భాగస్వామ్యంలో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల స్థాపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏటీసీ సెంటర్ల ద్వారా శిక్షణ పూర్తిచేసుకున్న వెంటనే యువతకు స్థానిక పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు లభించేందుకు దోహదపడినట్లు అవుతుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థలు)ను ఎటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)లుగా అప్గ్రేడ్ చేసిందన్నారు. ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన తర్వాత, యువత తమ సొంత కంపెనీలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.
…………………………………………