
* ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలి
* గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి
* నకిలీ విత్తనాలను, ఎరువులను అరికట్టాలి
* ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
* వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ఆకేరు న్యూస్ హనుమకొండః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) ఛైర్మన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ)సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కృషి సమ్మాన్ నిధి, కృషి సించయ్ యోజన పథకాలు రైతులకు అందే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పామాయిల్ సాగుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ సబ్సిడీ ఎక్కువగా ఉన్న పామాయిల్ సాగులో రైతులను ప్రోత్సహించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ సంఖ్యలో డెలివరీలు పెరిగే విధంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారువచ్చే దిశ మీటింగ్ నాటికి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు, శాఖలకు సంబంధించిన అన్ని వివరాలు ఉండేలా అధికారులు చూసుకోవాలని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష అనంతరం దిశ కమిటీ ఛైర్మన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు వచ్చే అవకాశం ఉన్నందువలన వచ్చే దిశ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో పాటు రైల్వే, పర్యాటక, దేవాదాయ, ఆర్కియాలజీ శాఖలు, యూనివర్సిటీ అధికారులు పాల్గొనాలన్నారు. జులై 21న పార్లమెంట్ సమావేశాలు ఉన్నందువలన వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ పథకాల ద్వారా ఇప్పటివరకు వచ్చిన నిధులు, ఇంకా రావాల్సిన వాటిపై అధికారులను పూర్తి సమాచారం అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే దిశ కమిటీ సమావేశం నాటికి సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, వాటి స్థితిగతులపై పూర్తిస్థాయి నివేదికలతో పాల్గొనాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవేవి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి తులనాత్మక పరిశీలన చేసి వాటి పూర్తిస్థాయి వివరాలతో సమావేశంలో పాల్గొనాలన్నారు. సమావేశం ముందునాటి రోజు వరకు సంబంధిత శాఖల అధికారులు అన్ని వివరాలతో హాజరుకావాలని సూచించారు.ఈ సమావేశంలో సమావేశం లో పాల్గొన్న మండల వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లా అధికారులువరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
…………………………………..