
ఆకేరు న్యూస్, జనగామ : పదో తరగతి పాస్ అయ్యిండ్లు పిల్లలు పై చదువులకు పాలకుర్తి పంపుదామనుకుంటే కాలేజ్ లేకపాయే.. ఇది సగటు పేద మద్య తరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రుల బాధ. పట్నం చదువులకు, ప్రైవేటు కాలేజ్లకు పంపుదామనుకుంటే ఫీజులు కట్టేంత స్తోమత్త లేదాయే.. అప్పోసప్పో చేసి చదివిస్తే పిల్లలు పట్నంలో ఉండకపాయే.. ఇక ఏమి చేయాలో తెలియక తల్లిదండ్రులు గత దశాబ్ధాలుగా మనోవేధనకు గురవుతున్నారు. ఏండ్లకేండ్లుగా పాలిస్తున్న పాలకులు పాలకుర్తిలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ను మంజూరు చేయించిన పాపాన పోవడం లేదు. కనీసం పాలకులు ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ను మంజూరు చేయించలేని నిస్సహాయ స్థితిలో ఉండటం పేద వర్గాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శాపంగా మారింది. పాలకుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మోక్షం లభించడం లేదు. కేవలం కాగితాలకే ఎమ్మెల్యేలు పరిమితం చేస్తున్నారు తప్పితే మంజూరు చేయించడానికి మనస్సు ఒప్పడం లేదా లేక పేదింటి విద్యార్థులకు ఉన్నత చదవులు ఎందుకులే అనే నిర్లక్ష్యమా అనేది తెలియడం లేదు. పాలకుర్తి పక్కను ఉన్న దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి కాని పాలకుర్తిలో మాత్రమే లేకపోడం విడ్డూరంగా ఉంది.
ఎమ్మెల్యేలు పట్టించుకోరా..
పాలకుర్తి ప్రాంతం వెనుకబడిన ప్రాంతం.. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులకు వెళ్ళాలంటే వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, జనగామకు వెళ్ళాల్సిందే. కొద్దో గొప్పో ఉన్నోళ్ళు తమ పిల్లలను ఉన్నత చదువులకు పట్నం పంపిస్తున్నా లేనోల్లు తమ పిల్లలను పది వరకే చదివించి వదిలేస్తున్నారు. దీంతో అరకొర చదువుకున్న విద్యార్థులు ఉపాధి అవకాశాలు లేక వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఎమ్మెల్యేలు పట్టించుకుని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ను మంజూరు చేపిస్తే పేదలకు ఉన్నత విద్య దొరుకుతుంది. యతిరాజరావు కాలంలో కో ఆపరేటివ్ జూనియర్ కాలేజ్ను మంజూరు చేయించారు. ఆ తరువాత దుగ్యాల శ్రీనివాసరావు జూనియర్ కళాశాలను మంజూరు చేయడానికి హైస్కూల్ను ఎంపిక చేశారు. ఇంటర్ మీడియట్ బోర్డు అధికారులు పాఠశాలను పరిశీలించారు.. సరే అన్నారు. మంజూరు మాత్రం చేయలేదు. ఇక మంత్రి గా పనిచేసిన దయాకర్రావు కళాశాల మంజూరుకు ప్రయత్నించారు.. కళాశాలకు ఓ కమిటి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు.. కమిటీ ఏర్పాటు చేయకముందే లుకలుకలు షురూ కావడం, ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో కాలేజ్ కాగితాలకే పరిమితమైంది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన యశస్విని రెడ్డి కాలేజ్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని విద్యార్థి సంఘాలు, సామాజిక ఉద్యమకారులు గతంలో ఎన్నోమార్లు ఎమ్మెల్యేలకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయింది. ఇకనైనా ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసేలా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేపిస్తానని మాటిచ్చిన ఎమ్మెల్యే ఆ మాటను నిలుపుకోవాలని, తమ చిరకాల కోరికను తీర్చాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
…………………………………………