
* ఆమె తండ్రి సంచలన ఆరోపణలు
* నిన్న రాత్రి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య
* అంతకు ముందు స్నేహితుడితో గొడవ జరిగినట్లు అనుమానాలు?
* ఆమె ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదంటున్న స్నేహితులు
* స్వేచ్ఛమృతిపై ప్రముఖుల సంతాపం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్టు, న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (ANCHOR SWETCHA VOTARKAR SUICIDE) మృతి చెందారు. నిన్న రాత్రి జవహర్ నగర్(JAWAHAR NAGAR)లోని తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయి వేలాడుతూ కనిపించారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోవడానికి ముందు స్నేహితుడితో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, ఆమె స్నేహితుల కథనం ప్రకారం.. స్వేచ్ఛ పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థల్లో న్యూస్ ప్రజెంటర్గా పని చేశారు, మహా టీవీ, టీవీ 9, హెచ్ ఎంటీవీ సంస్థల్లో పని చేసి గుర్తింపు పొందారు. ప్రస్తుతం టీ న్యూస్ లో పనిచేస్తున్నారు. ఆమె ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఒక కూతురు ఉంది. ఆమె ప్రస్తుతం తన కూతురు, స్నేహితుడు పూర్ణ చంద్రనాయక్ తో కలిసి ఉంటున్నారని సమాచారం కొన్నాళ్లుగా వారి మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయని, పూర్ణచంద్ర(POORNA CHANDRA)తో కలిసి ఉండలేనని ఇటీవలే తన తల్లిదండ్రులకు యాంకర్ తెలిపినట్లు వెలుగులోకి వచ్చింది. ఆయనతో కలిసి ఉండలేను నాన్నా అంటూ జూన్ 26న కూతురు చెప్పిందని స్వేచ్ఛ తండ్రి తెలిపారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి కన్నీటిపర్యంతం అయ్యారు. ఇటీవల జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కూడా స్వేచ్ఛ ఈసీ మెంబర్గా ఎన్నికయ్యారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు సన్నిహితులు, జర్నలిస్టులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అభిప్రాయ పడుతున్నారు. స్వేచ్ఛ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానా స్పద మృతి కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛమృతిపై ప్రముఖుల సంతాపం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్(KCR), కేటీఆర్, హరీశ్రావు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
……………………………………………..