
*ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
*ఇందూరు పంతం ఇందిరమ్మ రాజ్యం అంతం
* కేసీఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేస్తాం
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : ఇందూరు పంతం ఇందిరమ్మ రాజ్యం అంతం అనే నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్ లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకల్ ’వార్’ వన్ సైడ్, కాంగ్రెస్, బీజేపీల పతనం డిసైడ్ అని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్
రేవంత్ సర్కార్ మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయని జీవన్ రెడ్డి అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు భరించలేక రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అని అన్ని గ్రామాలు నినదిస్తున్నా యన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు గాల్లో కలిసి పోయాయని, 420 హామీల అమలు ఊసే లేదని ఆయన ధ్వజమెత్తారు.రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు ద్రోహం చేశారని, రేవంత్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయన్నారు, పల్లెల్లో పాలన పడకేసిందని, పారిశుధ్యం లోపించి గ్రామాల్లో చెత్తా చెదారం, పందులు,దోమలు విహారం చేస్తూ వ్యాధులు ప్రబలుతున్నాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త తరలించే ట్రాక్టర్లు డీజిల్ లేక తుప్పు పడుతున్నాయని అన్నారు. ప్రకృతి వనాలు పచ్చదనం పోయి ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ ఫ్యామిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరని ఆయన ఎద్దేవా చేశారు.పేదలకు రూ.4000 పెన్షన్ రావడంలేదని,ఆడబిడ్డలకు రూ.2500 ఇచ్చే మహాలక్ష్మి పథకం అమలు కావడం లేదని అన్నారు. అన్నదాతలకు రుణమాఫీ కాలేదని,రైతన్నలకు రూ.15,000 రైతుభరోసా ఎగ్గొట్టారని,మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా రావడం లేదన్నారు
ఇందిరమ్మ రాజ్యంలో ..
ఇందిరమ్మ రాజ్యంలో బుల్డోజర్ మాత్రం ఇంటింటికి వచ్చి ప్రజల బతుకులను కూల్చివేస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్ల పాలన తెలంగాణ ప్రజలకు స్వర్ణ యుగం కాగా, రేవంత్ పాలన రాతి యుగాన్ని తెచ్చిందని ఆయన చెప్పారు. హామీ ఇవ్వక పోయినా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్లు ఖర్చుపెట్టి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్ దన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచిత గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగు, అమ్మ ఒడి హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం ఇలా అనేక పథకాలు చెప్పకపోయినా అమలు చేశామన్నారు.
నిజామాబాద్ జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని ఇందూరు గడ్డ నుంచే శాసిస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేవరకూ నిద్రబోమన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ అని, కాంగ్రెస్, బీజేపీలు ప్రేతాత్మలు అని, అవి తెలంగాణకు పట్టిన శనిగొట్టుపార్టీలని ఆయన ధ్వజమెత్తారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కోసం తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమన్నారు.
బీఆర్ఎస్ ది పేగు బంధం
నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ ది పేగు బంధమని జీవన్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ పార్టీకి తొలి అధికార పదవినందించిన చరిత్ర నిజామాబాద్ జిల్లాదేనని గుర్తు చేశారు. సంతోష్ రెడ్డిని జిల్లాపరిషత్ ఛైర్మన్ ను చేసుకొని బీ ఆర్ఎస్ విజయానికి శ్రీకారం చుట్టిన చరిత్ర నిజామాబాద్ జిల్లాకు దక్కిందన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయడంలోనూ నిజామాబాద్ జిల్లాదే ప్రధాన పాత్ర అని జీవన్ రెడ్డి పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుజీత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్,మాస్త ప్రభాకర్,నక్కల భూమేష్,పూజ నరేంధర్,మెట్టు సంతోష్, రజనీష్,వెల్మల్ సురేష్,సుంకరి రవి,రంజిత్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
…………………………………………