* కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి
* మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుకు మధ్యాహ్న భోజన కార్మికుల విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, సిద్దిపేట : ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నదని, మా గోడును పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి , సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావును సిద్ధిపేటలో కలుసుకొని వరంగల్ మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హరీశ్రావుమాట్లాడుతూ ఆందోళన చెందవద్దని, డిమాండ్లు నెరవేరే వరకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పట్ల రేవంత్ సర్కారు కర్కషంగా, కఠినంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమన్నారు. పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణంమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని నమ్మించి, ఇప్పుడు నయవంచన చేయడం ద్రోహం చేయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నఫలంగా మధ్యాహ్న భోజన పథకం నుంచి దూరం చేస్తే 20 ఏండ్లుగా పని చేస్తున్న కార్మికుల పరిస్థితి ఏం కావాలి? ఏడాది కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనాలు పెట్టిన ఆ చిరు ఉద్యోగుల ఆర్థిక భారం ఎవరు తీర్చాలి? అని ప్రశ్నించారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికుల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలని, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని బిఆర్ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
…………………………………………….
