* నేటితో 14 ఏళ్లు.. కేటీఆర్ భావోద్వేగ ట్వీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. ఉద్యమ సారథి కేసీఆర్ పిలుపుతో యావత్ తెలంగాణ సమాజం ఒక్కటైందని చెప్పారు. సకల జనుల సమ్మెకు శనివారంతో 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె(Sakala Janula Samme) . సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె. సెప్టెంబర్ 12, 2011 రోజున కరీంనగర్ (KARIMNAGAR) జనగర్జనలో ఉద్యమ సారథి కేసీఆర్ గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయ్యింది. సమ్మెలో స్వచ్చంధంగా భాగస్వాములయ్యి, ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా అని దిక్కులు పిక్కటిల్లెలా తెలంగాణ ప్రజలు నినదించారు. నిర్బంధాలను ఛేదించి, ఆంక్షలకు ఎదురొడ్డి, బెదిరింపులను లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ బిడ్డలు పోరాడారు. సకల జనుల సమ్మెకు నేటితో 14 ఏళ్ళు నిండిన సందర్భంగా.. సమ్మెలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
……………………………..
