* ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన భూ బాగోతం
ఆకేరు న్యూస్ వరంగల్ : లేని భూమిని సృష్టించి ఐకేపీ సెంటర్లకు ధాన్యం సరఫరా చేసినట్లుగా బిల్లు సృష్టించుకొని ప్రభుత్వం వద్ద కొంత మంది వ్యక్తులు కోట్లు దండుకున్నారు. శాయంపేట మండలం కాట్రపల్లిలో జరిగిన ఈస్కాంను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మీడియాకు వివరించారు, ఈ కేసులో ప్రస్తుత కేసులో ప్రధాన నిందితుడు బెజ్జంకి శ్రీనివాస్ రబీ సీజన్ సమయంలో బండ లలిత అనే మహిళతో కలిసి ఈ స్కాంకు పాల్పడ్డట్లు తెలిపారు. వీరిద్దరికీ ట్యాబ్ ఆపరేటర్ చరణ్ సింగ్ సహకరించినట్లు డీసీపీ తెలిపారు. నకిలీ పంట వివరాలు నమోదు చేసి, ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఇద్దరు కలిసి ఒక్కో క్వింటాకు రూ.120/- చొప్పున కమీషన్, బెజ్జంకి శ్రీనివాస్ ఒక్కో క్వింటాళుకు రూ.500/- బోనస్, రూ.50/- మిల్లింగ్ చార్జీ రూపంలో లాభం పొందేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మొత్తం 8,049 క్వింటాళ్లపై రూ. 2.10 కోట్లు విలువైన నిధులు అక్రమంగా పొందినట్లు తేలింది.ఇందులో భాగంగా బెజ్జంకి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులు మరియు బంధువులు 12 మందిని నకిలీ రైతులుగా చూపించి, శాయంపేట మండల పరిధిలోని 278 ఎకరాల ప్రభుత్వ పోడు భూమిలో వరి పంట పండించినట్లు తప్పుడు వివరాలు సమర్పించాడు. టోకెన్ బుక్స్ నకిలీగా వ్రాసి, మండల AEO, AO లాగిన్ ID ల ద్వారా నకిలీ ఎంట్రీలు చేశాడు.దాంతో ప్రభుత్వ కార్పొరేషన్ నిధి నుండి ఈ నకిలీ రైతుల 12 మంది అకౌంట్లలో రూ.1.86 కోట్లు, అదనంగా బండ లలిత, చరణ్ సింగ్, బండ రజినీకర్ రెడ్డి అకౌంట్లలో రూ.24 లక్షలు జమ అయ్యాయి. మొత్తం 15 మంది పేర్లపై 314 ఎకరాలకు, 9,100 క్వింటాళ్లకు గాను రూ.2.10 కోట్లు మోసపూరితంగా పొందినట్లు నిర్ధారణ అయింది.
నిందితుల లాభం ఇలా ఉంది…
బండ లలిత, చరణ్ సింగ్ కు రూ.10.92 లక్షలు, బెజ్జంకి శ్రీనివాస్ కు రూ.4.5 లక్షలు, తర్వాత బెజ్జంకి శ్రీనివాస్ రూ.1.32 కోట్లు డ్రా చేసి, అందులో భాగంగా రూ.32 లక్షలు (రిజిస్ట్రేషన్ ఖర్చులతో కలిపి) వెచ్చించి కమలాపూర్ మండలం, పంగిడిపల్లి గ్రామం, సర్వే నం.25/Fలో ఒక ఎకరం భూమి తన కుమారులు బెజ్జంకి పున్నం చారి, బెజ్జంకి శివ కుమార్ పేర్లపై కొనుగోలు చేశాడు. ఆ తరువాత రూ.8 లక్షలు వెచ్చించి TATA Nexon (TS08 JR 2471) కారు కొనుగోలు చేశాడు.రూ.1.06 కోట్లు ఖర్చు చేసి గత సీజన్ మరియు ప్రస్తుత సీజన్ షార్టేజ్ ధాన్యం కొనుగోలు చేశాడు.లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సుదాటి రాజేశ్వర్ రావు రూ.4 లక్షలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు తిరిగి చెల్లించాడు.దర్యాప్తు సమయంలో రూ.54 లక్షలు నిందితుల బ్యాంక్ అకౌంట్లలో ఫ్రీజ్ చేయబడ్డాయి. దర్యాప్తు లో భాగంగా మొత్తం రూ.1,07,84,134/- విలువైన ఆస్తులు మరియు నగదు స్వాధీనం చేయడం జరిగింది.

………………………………………………………
