ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
* తెలుగు జాతి అంతా ఒక్కటే..
* ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి
* హైదరాబాద్ కు నీళ్లు తెచ్చింది నేనే
* ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, అమరావతి : రాజకీయ నేతలు పోటీ పడి మాట్లాడడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (Ap Cm Chandrababu Naidu) అన్నారు. దేవాదులను ముందుకు తీసుకెళ్లండి.. ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. తెలుగుజాతి అంతా ఒక్కటే అని ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలని సూచించారు. సముద్రంలో వృథాగా కలిసే నీళ్లను ఎవరైనా వాడుకోవచ్చని, నీళ్లపై రాజకీయాలు చేయొద్దని తెలంగాణను కోరుతున్నా అన్నారు. ప్రజలు కూడా విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రావొద్దన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, పోలవరానికి అడ్డుపడడం సరికాదని తెలంగాణ నేతలకు సూచించారు. పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన తెలంగాణ(Telangana)లోని కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో హైదరాబాద్(Hyderabad)కు వారానికి ఒకసారే నీళ్లు వచ్చేవని, నాగార్జున సాగర్ నుంచి నీళ్లను తెచ్చి ఇచ్చామని గుర్తు చేశారు. ఆర్టీఎస్ లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్నగర్ కు ఇచ్చామని వెల్లడించారు. దేవాదుల, కల్వకుర్తి తానే ప్రారంభించానని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, రాజకీయ నేతలు పోటీ పడి మాట్లాడడం ఎవరికీ మంచిది కాదని సూచించారు. అనుమతులు లేని ప్రాజెక్టులు ప్రారంభించి రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఎన్జీటీకి రూ.100 కోట్ల జరిమానా కట్టారని తెలిపారు. ముచ్చుమర్రి ఇప్పటికే ఉందని, అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చని అన్నారు. వైఎస్ ఆర్ ప్రభుత్వం వల్లే పోలవరం ఆలస్యమైందని విమర్శించారు.
…………………………………………………
