ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలిసారిగా
అమరావతిలో ఈ వేడుకలు జరగడం గమనార్హం. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలు చేపట్టారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వీకరించారు. ఈ ఏడాది వేడుకల్లో 22 అలంకృత శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందేమాతరం, పది సూత్రాల మిషన్, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ, పాఠశాల విద్య, వ్యవసాయ శాఖ, సీఆర్డీఏ తదితర విభాగాల శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. ఈ వేడుకలకు అమరావతి రైతులు, స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
…………………………………………………………
