* సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక!
ఆకేరు న్యూస్ ,హైదరాబాద్: వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మరోసారి హెచ్చరించారు. నిత్యం సోషల్ మీడియా ద్వారా సామాజిక అంశాలపై స్పందించే ఆయన, తాజాగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఒక కళ్ళు చెదిరే వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో, అతివేగం మరియు అజాగ్రత్త వల్ల జరిగే అనర్థాలను కళ్ళకు కట్టినట్లుచూపుతోంది.మనం చేసే చిన్న పొరపాటు లేదా క్షణికావేశం, ఎదుటివారి కుటుంబాల్లో ఎప్పటికీ పూడ్చలేని లోటును మిగిలిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాహనం నడిపేటప్పుడు కేవలం మన ప్రాణాలే కాదు, రోడ్డుపై వెళ్లే ఇతరుల భద్రత కూడా మన బాధ్యతే అని గుర్తుచేశారు. అతివేగం ప్రాణాంతకమని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రాథమిక ధర్మమని పేర్కొన్నారు.”మీ నిర్లక్ష్యం వేరొకరి జీవితాన్ని బలి తీసుకోనివ్వకండి. రోడ్డుపై బాధ్యతగా మెలగండి” అని సజ్జనార్ ప్రజలను కోరారు.
………………………………………………………..
