ఆకేరు న్యూస్ , హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ, కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో (ఫిబ్రవరి 3) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.
మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. గడువు ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.ఈసారి పురపోరులో పోటీ తీవ్రంగా ఉంది. అధికారుల గణాంకాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం వార్డులు: 2,996
దాఖలైన నామినేషన్ సెట్లు: 29,694
మొత్తం అభ్యర్థులు: 20,313
పరిశీలన అనంతరం అర్హత పొందినవి: 19,608
రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. ఉపసంహరణ గడువు ముగిస్తే గానీ అసలు ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారు? స్వతంత్రుల ప్రభావం ఎంత? అనే విషయంపై స్పష్టత రానుంది. సాయంత్రం కల్లా అభ్యర్థుల వారీగా గుర్తుల కేటాయింపు ప్రక్రియ కూడా మొదలుకానుంది.
…………………………………………………….
